
హైదరాబాద్సిటీ, వెలుగు: రవీంద్రభారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై ది మ్యూజిక్ కల్చరల్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఎస్పీబీ 79వ జయంతి సందర్భంగా బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శి అచ్యుత రామరాజు, కృష్ణమూర్తి మాట్లాడారు. 50 ఏండ్ల పాటు సుమారు 45 వేల పాటలతో తెలుగుజాతి కీర్తిని ప్రపంచానికి చాటిన గాన గంధర్వుడు ఎస్పీబీ అని కొనియాడారు. తెలుగుజాతి ప్రతిష్ఠను ప్రపంచ నలుమూలలకు తెలిసేలా చేసిన ఎస్పీబీ విగ్రహాన్ని రాజధానిలో ఏర్పాటు చేయాలని తాము ప్రభుత్వాన్ని కోరామని, అందుకు సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ధన్యవాదాలు తెలిపారు. ట్రెజరీ సురేఖమూర్తి, ఆలూరి, స్వామి, ధర్మతేజ పాల్గొన్నారు.