పాడైన టాయిలెట్.. డైపర్లతో ఆస్ట్రోనాట్ల ప్రయాణం

పాడైన టాయిలెట్.. డైపర్లతో ఆస్ట్రోనాట్ల  ప్రయాణం

వాషింగ్టన్: ఇంటర్నేషనల్ స్పేస్​ స్టేషన్(ఐఎస్​ఎస్)  నుంచి భూమి మీదకు తిరిగొచ్చేందుకు సిద్ధమవుతున్న ఆస్ట్రోనాట్లకు అనుకోని సమస్య వచ్చింది. వారొచ్చే స్పేస్​ఎక్స్​ క్యాప్సూల్​లో టాయిలెట్​ పాడైపోయింది. దీంతో ఆస్ట్రోనాట్లంతా డైపర్లు పెట్టుకుని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. శుక్రవారం నాసా ఆస్ట్రోనాట్​ మేగన్​ మెక్​ ఆర్థర్​.. ఈ సమస్యపై మాట్లాడారు. ఐఎస్​ఎస్​ నుంచి నిర్వహించిన ప్రెస్​ కాన్ఫరెన్స్​లో సమస్యను వివరించారు. ‘‘స్పేస్​ఫ్లైట్​లో చిన్నచిన్న సవాళ్లు ఎన్నో ఉన్నాయి’’ అంటూ చెప్పుకొచ్చారు. అయితే, వాటన్నింటినీ మేనేజ్​ చేసుకోవచ్చన్నారు. వాటి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆదివారం మెక్​ఆర్థర్​ సహా నలుగురు ఆస్ట్రోనాట్లు భూమికి తిరిగొచ్చే అవకాశాలున్నాయి. నిజానికి గత వారమే రావాల్సి ఉన్నా.. ప్రతికూల వాతావరణం,  ఒకరికి ఆరోగ్యం బాగాలేకపోవడం వంటి కారణాలతో వాయిదా వేశారు. ఇప్పుడు ఈ టాయిలెట్​ సమస్య వచ్చి పడింది. ఇప్పటికీ మిషన్​ ఉంటుందా.. ఉండదా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. 6 నెలలుగా అంతరిక్షంలో శ్రమించామని ఫ్రెంచ్​ ఆస్ట్రోనాట్​ థామస్​ పెస్క్వెట్​ అన్నారు. ఐఎస్​ఎస్​ పవర్​ గ్రిడ్​ను అప్​డేట్​ చేసేందుకు, స్టేషన్​ను విసిరిపారేసిన రష్యన్​ స్పేస్​షిప్​ల థ్రస్టర్లను (ఇంజన్లు) ఆపేందుకు కఠినమైన స్పేస్​వాక్​లు చేశామని చెప్పారు. 

క్యాప్సూల్​ భద్రమే

నిజానికి సెప్టెంబర్​లోనే స్పేస్​ఎక్స్​ క్యాప్సూల్​లో సమస్యను గుర్తించారు. ఓ ట్యూబ్​ ఊడిపోయి మూత్రమంతా క్యాప్సూల్​లో పడిందంటున్నారు. ఎక్కడ చూసినా అదే ఉందని చెప్తున్నారు. తర్వాత సమస్యను పరిష్కరించినా.. వాడుకోవడానికి మాత్రం పనికిరాదని తేల్చారు. ట్యూబ్​ ఊడి మూత్రం పడినా.. క్యాప్సూల్​ సురక్షితమేనని ఇంజనీర్లు చెప్తున్నారు. ముప్పేమీ లేదంటున్నారు. మెక్​ఆర్థర్​, పెస్క్వెట్​లతో పాటు నాసా ఆస్ట్రోనాట్​ షేన్​ కింబ్రో, జపాన్​ ఆస్ట్రోనాట్​ అకిహికో హొషిడేలు భూమికి తిరిగి రానున్నారు. ఈ ఏడాది ఏప్రిల్​28న వాళ్లు ఐఎస్​ఎస్​కు వెళ్లారు.