ఈ ఏడాది విద్యుత్ చార్జీల పెంపు ఉండదు..గృహజ్యోతి పథకం వల్ల విద్యుత్ చౌర్యం తగ్గింది: ఎస్పీడీసీఎల్ సీఎండీ  జితేశ్ వి పాటిల్  

ఈ ఏడాది విద్యుత్ చార్జీల పెంపు ఉండదు..గృహజ్యోతి పథకం వల్ల విద్యుత్ చౌర్యం తగ్గింది: ఎస్పీడీసీఎల్ సీఎండీ  జితేశ్ వి పాటిల్  
  • ఫిబ్రవరి వరకు 5.44 కోట్ల మందికి జీరో బిల్లులు జారీచేసినం 
  • రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.1930.66 కోట్ల సబ్సిడీ డబ్బులు వచ్చినయ్​ 
  • ఈఆర్​సీ ఆధ్వర్యంలో ముగిసిన బహిరంగ విచారణ

హైదరాబాద్, వెలుగు:  ఈ ఏడాది విద్యుత్​ చార్జీల పెంపు ఉండదని ఎస్పీడీసీఎల్​ సీఎండీ జితేష్ వి పాటిల్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం వల్ల విద్యుత్​ చౌర్యం తగ్గిందని పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు తమ సంస్థ పరిధిలో 5.44 కోట్ల జీరో బిల్లులు జారీ చేయగా వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.1,930.66 కోట్ల సబ్సిడీ డబ్బులు వచ్చాయన్నారు.

శుక్రవారం హైదరాబాద్​లోని ఈఆర్​సీ భవన్​లో చైర్మన్​ జస్టిస్​ డి.నాగార్జున్​ అధ్యక్షతన 2026–27 సంవత్సరానికి సవరించి దాఖలు చేసిన సమగ్ర ఆదాయ ఆవశ్యకత, ప్రతిపాదిత ధరలు, క్రాస్​ సబ్సిడీ సర్​చార్జ్​ ప్రతిపాదనలపై బహిరంగ విచారణ జరిగింది. దీనిలో జీహెచ్​ఎంసీతో పాటు, దక్షిణ విద్యుత్​ పంపిణీ సంస్థ పరిధిలోని జిల్లాల నుంచి వినియోగదారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వినియోగదారులు అడిగిన ప్రశ్నలకు సంస్థ సీఎండీ జితేష్ సమాధానాలిచ్చారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎస్పీడీసీఎల్​ పరిధిలో మొత్తం కోటి 20 లక్షల 95 వేల 963 మంది వినియోగదారులు ఉన్నట్టుగా తెలిపారు. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం 12 లక్షల 09 వేల 563  మంది వినియోగదారులు పెరిగారని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ వరకు 39,556 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగించినట్టుగా తెలిపారు.

వాటిలో గృహ విద్యుత్ వినియోగం 23%  ఉండగా, పారిశ్రామిక రంగం 31%, వ్యవసాయ రంగం 21%, కమర్షియల్ 16 %, ఇతర కేటగిరీల్లో 9 శాతంగా నమోదైందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 3న 18,139 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదు కాగా అందులో కేవలం జీహెచ్​ఎంసీ పరిధిలోనే 4,421 మెగావాట్ల రికార్డు నమోదైనట్టుగా తెలిపారు.  

రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్​గ్రేషియా పంపిణీ

విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు రైతుల కుటుంబాలకు ఈఆర్​సీ చైర్మన్ జస్టిస్ డి. నాగార్జున్ రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెక్కులు అందించారు. వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం కేరెల్లికి చెందిన రైతు ఎన్. చంద్రారెడ్డి,  సిద్దిపేట జిల్లా కొండపాక మండలం విశ్వనాథపల్లికి చెందిన రైతు నలిగామ కనకయ్య విద్యుత్ షాక్​కు గురై ప్రాణాలు కోల్పోయారు.

ఈ విషయం తెలిసిన కొద్ది గంటల్లోనే ఈఆర్​సీ చైర్మన్​ ఆదేశాలతో సంస్థ సిబ్బంది రూ.5 లక్షల చొప్పున ఎక్స్​ గ్రేషియా చెక్కులు రెడీ చేయగా వీటిని బాధిత రైతు కుటుంబాలకు చైర్మన్​అందించారు. ఈ కార్యక్రమంలో ఈఆర్​సీ సభ్యులు కె. రఘు, శ్రీనివాస్​ రావు తదితరులు పాల్గొన్నారు.