బడ్జెట్ సెషన్ ఏర్పాట్లపై స్పీకర్ సమీక్ష

బడ్జెట్ సెషన్ ఏర్పాట్లపై స్పీకర్ సమీక్ష

మార్చి 7 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ప్రభుత్వాధికారులు, పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. కమిటీ హాల్లో జరిగిన మీటింగ్లో మండలి ప్రొటెం ఛైర్మన్ సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ, సీఎస్ సోమేశ్ కుమార్, స్పెషల్ సీఎస్ (ఫైనాన్స్) రామకృష్ణారావు, డీజీపీ మహేందర్ రెడ్డితో మూడు కమిషరేట్ల పోలీస్ కమిషనర్లు పాల్గొన్నారు. గత సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించిన అధికారులు, సిబ్బందికి స్పీకర్ ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు పారదర్శకంగా జరిగేందుకు సహకరించాలని.. సభ్యులు అడిగే సమాచారాన్ని వీలైనంత తొందరగా అందించాలని పోచారం కోరారు. 

కరోనా ప్రభావం తగ్గినప్పటికీ తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడంతో పాటు లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహించేందుకు కరోనా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశాలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పోలీసు శాఖ తరఫున సహాయ సహకారం అందించాలని స్పీకర్ సూచించారు.