ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్: రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కీ వెంకటయ్య

ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్: రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్  బక్కీ వెంకటయ్య
  • కేసుల నమోదుపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు  
  • పరిహారం విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం  
  • రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కీ వెంకటయ్య

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీల అట్రాసిటీ కేసులు, ల్యాండ్  సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పోలీస్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, భూ సమస్యలపై ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషన్ సభ్యులతో పాటు చైర్మన్ పాల్గొని సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కేసులపై నిర్లక్ష్యం వహిస్తే కమిషన్ చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రతి మూడు నెలలకోసారి డీఎంసీ, ప్రతి నెలా సివిల్ రైట్స్ డే నిర్వహించి చట్టాలపై, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలన్నారు.

2022 నుంచి 2025 వరకు 571 కేసులు నమోదవగా 135 ఇన్వెస్టిగేషన్ దశలో ఉన్నాయని,15 చార్జిషీట్ కేసులున్నాయని, వీటి పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలనన్నారు. ఇప్పటివరకు 210  కేసులకు రూ.2 కోట్ల 47 లక్షల పరిహారం ఇచ్చామన్నారు. కావాల్సిన నష్ట పరిహారం గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధుల మంజూరుకు కృషి చేస్తానన్నారు. ఎస్సీ, ఎస్టీల  భూ సమస్యలకు సంబంధించిన కేసులను పరిశీలించి వెంటనే న్యాయం చేయాలన్నారు. అడిషనల్​కలెక్టర్ (రెవెన్యూ ) ముకుంద రెడ్డి, డీసీపీ శ్వేత, కమిషన్ సభ్యులు జిల్లా శంకర్, కురసం, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బి రాంప్రసాద్ పాల్గొన్నారు.