భారత రాజకీయాల్లో ముగిసిన మరో అధ్యాయం

భారత రాజకీయాల్లో ముగిసిన మరో అధ్యాయం

భారత రాజకీయాల్లో మరో శిఖరం ఒరిగిపోయింది. ఆరు దశాబ్దాల పాటు యూపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నేతాజీ ప్రస్థానం ముగిసింది. అగ్రవర్ణ ఆధిపత్యం ఉన్న యూపీలో రాజకీయంగా ఎదగడమే కాదు.. రాష్ట్ర పగ్గాలు చేపట్టిన రాజకీయాలను తిరగరాసిన మూలాయం సింగ్ ఇక సెలవంటూ వెళ్లిపోయారు. అనారోగ్యానికి గురై మేదాంత హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 

 

బాల్యం


1939 నవంబర్ 22న సుఘర్ సింగ్ యాదవ్, మూర్తి దేవి దంపతులకు జన్మించారు ములాయం సింగ్ యాదవ్. యూపీ ఇటావా జిల్లాలోని సైఫాయ్ ఆయన స్వస్థలం. ఇటావాలోని కర్మ క్షేత్ర పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ నుంచి బీఏ పట్టా పొందిన ఆయన.. షికోహాబాద్ లోని ఏకే కాలేజ్ నుంచి బీటీ, ఆగ్రా యూనివర్సిటీ నుంచి ఎంఏ పట్టా అందుకున్నారు.

రాజకీయ ప్రస్థానం


రామ్ మనోహర్ లోహియా, రాజ్ నారాయణ్ అడుగుజాడల్లో నడుస్తూ ములాయం తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఢిల్లీ పీఠానికి దగ్గరి దారిగా చెప్పే ఉత్తర్ ప్రదేశ్ కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత నేతాజీ సొంతం. 1967లో యూపీ అసెంబ్లీలో తొలిసారి ఆయన అడుగుపెట్టారు. 1975లో ఇందిరా గాంధీ అత్వవసర స్థితి విధించినప్పుడు మూలాయంను అరెస్టు చేసి 19 నెలల పాటు జైలులో ఉంచారు. ఆ తర్వాత 1977లో తొలిసారి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1980లో, ఉత్తరప్రదేశ్‌లోని లోక్‌దళ్ (పీపుల్స్ పార్టీ) అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన.. ఆ తర్వాత దాన్ని జనతాదళ్ లో విలీనం చేశారు. 1982లో ఉత్తరప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికై 1985 వరకు ఆ పదవిలో కొనసాగాడు. లోక్ దళ్ పార్టీ చీలిపోయినప్పుడు, యాదవ్ క్రాంతికారి పార్టీని ప్రారంభించాడు. 

తొలిసారి యూపీ పీఠం


1989లో ములాయం సింగ్ యాదవ్ తొలిసారి యూపీ సీఎం అయ్యారు. 1990 నవంబరులో వీపీ సింగ్ ప్రభుత్వం కూలిపోవడంతో ములాయం యాదవ్, చంద్ర శేఖర్ నాయకత్వంలోని జనతా దళ్ (సోషలిస్ట్) పార్టీలో చేరాడు. కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాడు. జాతీయ స్థాయిలో చంద్ర శేఖర్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో 1991 ఏప్రిల్ లో మలాయంసింగ్ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతును ఉపసంహరించుకుంది. దీంతో ములాయం ప్రభుత్వం కూలిపోయింది. మధ్యలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికలు రాగా.. ములాయం పార్టీ పరాజయం పాలైంది. 

కాంగ్రెస్, జనతాదళ్ మద్దతుతో


1992లో ములాయం సింగ్ సొంతంగా సమాజ్ వాదీ పార్టీ స్థాపించారు.1993 నవంబరులో యూపీ అసెంబ్లీకి ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకుని అధికారం చేజిక్కించుకున్నారు. కాంగ్రెస్, జనతాదళ్ మద్దతుతో ములాయం రెండోసారి యూపీ సీఎం అయ్యారు. 1994 అక్టోబర్ 2న ముజఫర్ నగర్ లో ప్రత్యేక ఉత్తరాఖండ్ ఉద్యమంలో పాల్గొంటున్న వారిపై కాల్పుల జరిగాయి. ఇందుకు ములాయంను బాధ్యుడిగా భావించి మిత్రపక్షం కూటమి నుంచి వైదొలగడంతో ఆయన పదవి వదులుకోవాల్సి వచ్చింది. 

ఉప ఎన్నికలో రికార్డు


2002లో యూపీ అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీజేపీ, బీఎస్పీలు కలిసి మాయావతి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కానీ 2003 ఆగస్టు 25న బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో మాయావతి సర్కారు కుప్పకూలింది. బీజేపీ మద్దతుతో ములాయం సింగ్ యాదవ్ 2003 సెప్టెంబర్ లో ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే అప్పటికి ఆయన లోక్ సభ ఎంపీగా ఉండటంతో ఆరు నెలల్లోపు శాసనసభ్యుడిగా ఎన్నిక కావాల్సి ఉండటంతో 2004లో జరిగిన గున్నౌర్ ఉప ఎన్నికలో పోటీ చేసి 94శాతం ఓట్లతో విజయం సాధించి రికార్డు సృష్టించాడు. 

జాతీయ రాజకీయాలపై ఆసక్తి


ములాయంఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే  కేంద్రంలో ప్రధాన పాత్ర పోషించాలనే ఆశతో, 2004 లోక్‌సభ ఎన్నికల్లో మెయిన్‌పురి నుంచి పోటీ చేసి గెలిచాడు. అప్పట్లో సమాజ్ వాదీ పార్టీ యూపీలోని అన్ని పార్టీల కన్నా ఎక్కువ సీట్లు గెలుచుకుంది. అయితే ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టుల మద్దతుతో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఫలితంగా కేంద్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలన్న ఆయన ఆశ నెరవేరలేదు. దీంతో లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, 2007 వరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2007 ఎన్నికలలో బీఎస్పీ విజయం సాధించింది. 

ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం..
1967లో తొలిసారి శాసన సభ్యుడిగా ఎన్నికైన ములాయం.. మొత్తం 10 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. జశ్వంత్ నగర్ నుంచి ఏడుసార్లు గన్నౌర్ నుంచి రెండుసార్లు సహస్వాన్ నుంచి ఓసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1996 నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న ఆయన.. 2003లో ఎంపీగా ఉండగానే యూపీ సీఎం బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో మొయిన్ పురి నుంచి ఎంపీగా గెలుపొందినా.. రాజీనామా చేసి యూపీ సీఎంగానే కొనసాగారు.

ఐదుసార్లు ఎంపీ

ములాయం సింగ్ ఐదుసార్లు మొయిన్ పురి ఎంపీగా గెలిచారు. సంభాల్ నుంచి రెండుసార్లు కనౌజ్, అజాంగఢ్ నుంచి ఒక్కోసారి విజయం సాధించారు. కనౌజ్ కు 2000లో రాజీనామా చేయడం ద్వారా తన కుమారుడు అఖిలేశ్ రాజకీయ ప్రస్థానానికి బాటలు వేశారు. 1999, 2014లో ములాయం రెండుసార్లు రెండేసి నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలవడం విశేషం. 1982లో ములాయం ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 1996 – 98 కాలంలో ములాయం కేంద్ర రక్షణ శాఖ మంత్రి బాధ్యతలు నిర్వర్తించారు. 

ఇద్దరు భార్యలు


ములాయం రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. మొదటి భార్య మాలతీదేవి 2003లో అనారోగ్యంతో చనిపోయారు. అనంతరం సాధన గుప్తాను వివాహమాడారు. సాధన ఐదుగురు అన్నదమ్ముల్లో ములాయం మధ్యవారు. అన్నలిద్దరూ వెలుగులోకి రాకున్నా.. ఇద్దరు తమ్ముళ్లు రాజ్ పాల్, శివపాల్ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఇక ములాయం కొడుకు అఖిలేష్ యాదవ్ సైతం 2012 నుంచి 2017 వరకు యూపీ సీఎంగా కొనసాగారు.