
న్యూఢిల్లీ: ఆట కంటే ఎవరూ గొప్ప కాదని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. టీమిండియా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య కెప్టెన్సీ మార్పుతో విభేదాలు వచ్చాయనే వార్తలపై స్పందనగా ఠాకూర్ పైవ్యాఖ్య చేశారు. ‘స్పోర్ట్స్ అందరికీ సుప్రీం. గేమ్ కంటే ఎవరూ గొప్ప కాదు. ఏయే గేమ్స్ లో ఆటగాళ్ల మధ్య ఏం జరుగుతుందనేది నేను చెప్పలేను. అది ఫెడరేషన్లు, అసోసియేషన్ల పని. ప్లేయర్ల మధ్య ఏం జరుగుతుందో వాళ్లే చెప్పాలి’ అని ఓ నేషనల్ మీడియా చానల్ అడిగిన ప్రశ్నకు అనురాగ్ ఠాకూర్ జవాబిచ్చారు.
కాగా, వన్డే కెప్టెన్సీ మార్పు ఇండియా క్రికెట్ టీమ్ లో.. కోహ్లీ, రోహిత్ మధ్య అగ్గిరాజేసినట్లే కనిపిస్తోంది. తనను తప్పించి వన్డే నాయకత్వ పగ్గాలను రోహిత్ కు అప్పగించడం, బోనస్ గా టెస్టు వైస్ కెప్టెన్సీ కూడా ఇవ్వడంపై విరాట్ గుస్సాగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో బీసీసీఐ నిర్ణయాన్ని గౌరవించడం లేదని కోహ్లీ మీద హిట్ మ్యాన్ సీరియస్ గా ఉన్నాడని సమాచారం. ప్రస్తుతం ఈ ఇద్దరు ఆటగాళ్లు ఒకరికొకరు ఎదురు పడేందుకూ ఇష్టపడటం లేదట. ఒకరి కెప్టెన్సీలో మరొకరు ఆడేందుకు నిరాకరిస్తున్నారని తెలుస్తోంది. సౌతాఫ్రికా టూర్ లో భాగంగా ఈ నెల 26 నుంచి జరిగే టెస్టు సిరీస్ కు రోహిత్ శర్మ గాయం కారణంగా దూరమవ్వడం.. అదే జట్టుతో జరిగే వన్డే సిరీస్ కు కూతూరి బర్త్ డే కారణంతో కోహ్లీ రెస్ట్ కావాలని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. కోహ్లీ తీరుపై బీసీసీఐ పెద్దలు కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని వార్తల కోసం: