గతేడాది ‘సామజవరగమన’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న శ్రీవిష్ణు ఇప్పుడు ‘ఓం భీమ్ బుష్’ అంటూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నాడు. శ్రీహర్ష దర్శకత్వంలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలతో కలిసి నటించిన ఈ చిత్రం రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా శ్రీవిష్ణు చెప్పిన విశేషాలు.
‘‘ఈ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది. ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని పాయింట్. రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్గా ప్రజెంట్ చేస్తూ కంప్లీట్ ఎంటర్టైనర్గా చేశాం. ఆడియెన్స్ హిలేరియస్గా ఎంజాయ్ చేస్తారు. ఇందులో కామెడీతో పాటు మిస్టరీ, థ్రిల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ‘బ్రోచేవారెవరురా’ తర్వాత నేను, ప్రియదర్శి, రాహుల్ కలిసి నటించిన చిత్రమిది. మేం రెగ్యులర్గా కలుసుకోవడంతో షూటింగ్ చాలా సరదాగా సాగిపోయింది. కథలో మా ముగ్గురి పాత్రలు చూస్తే.. మేము సైంటిస్టులు కావాలని యూనివర్సిటీలో పదేళ్లుగా పీహెచ్డీ చేస్తాం.
మమ్మల్ని ఎలాగైనా కాలేజీ నుంచి పంపించేయాలని స్కెచ్ వేసి పంపించేస్తారు. తర్వాత భైరవపురం అనే ఊరికి వస్తాం. ఆ ఊరిలో ఎదురయ్యే పరిస్థితులు, పాత్రలు ఎంటర్టైనింగ్గా ఉంటాయి. ఈ క్రమంలో నిధిని పట్టుకునే టాస్క్ వస్తుంది. అసలు నిధి ఉందా లేదా, మా ప్రయత్నాలు ఎలా జరిగాయనేది మిగతా కథ. అద్భుతమైన టీమ్, యూవీ క్రియేషన్స్ లాంటి ప్రొడక్షన్ హౌస్లో నటించడంతో అంతా సజావుగా సాగింది.
ఈ చిత్రానికి ముందు వేరే టైటిల్స్ అనుకున్నాం. అందులో ఒకటి ఇంగ్లీష్లో వస్తుంది. నేను మాత్రం ‘ఓం భీమ్ బుష్’ చాలా క్యాచీగా ఉంటుందని చెప్పా. టైటిల్స్ విషయంలో నేను ప్రత్యేక శ్రద్ధ చూపిస్తా. సినిమాని ముందు ప్రేక్షకుల దగ్గరకి తీసుకెళ్ళేది అదే కదా. ఇక ప్రస్తుతం ‘శ్వాగ్’ చిత్రంతో పాటు ఓ థ్రిల్లర్ మూవీ చేస్తున్నా. అలాగే గీతా ఆర్ట్స్లో సినిమా చేయాల్సి ఉంది’’.