కొలంబో: శ్రీలంక బాంబు దాడుల నేపథ్యంలో రక్షణ శాఖ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో గురువారం రాజీనామా చేశారు. అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆదేశం మేరకు ఆయన రాజీనామాచేశారని కొలంబో గెజిట్ వెల్లడించింది. డ్రోన్లు,అన్ మాన్డ్ ఏరియల్ వెహికిల్స్ వాడకాన్ని లంక ప్రభుత్వం తాత్కాలికంగా బ్యాన్ చేసింది. మళ్లీ ఆదేశాలిచ్చే వరకు నిషేధం అమల్లో ఉంటుందని సివిల్ ఏవియేషన్ అథారిటీ వెల్లడించింది. మరోవైపు లంకలో తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇంటర్ పోల్ సహా ఆరు దేశాల పోలీసులు లంకకు సహకరిస్తున్నారు. గురువారం 16 మంది అనుమానితులను అరెస్టు చేశారు. దీంతో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య 76కు చేరింది. ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లే బాంబు దాడులు జరిగాయని శ్రీలంక ప్రభుత్వం ఒప్పుకుంది.
సూసైడ్ బాంబర్లలో చాలామంది స్వదేశీయులేనని, యూకే లాంటి దేశాల్లోబాగా చదువుకున్న వారేనని రక్షణ శాఖ సహాయమంత్రి రువాన్ విజెవర్ధనే చెప్పారు. 9 మంది బాంబర్లలో 8 మందిని గుర్తించామని, తొమ్మదోవ్యక్తి సూసైడ్ బాంబర్లలో నే ఒకరి భార్యగా భావిస్తున్నామని చెప్పారు. కాగా బాంబు దాడులతో సంబంధమున్నట్టు అనుమానిస్తున్న సుగంధద్రవ్యాల వ్యాపారి మహ్మద్ యూసుఫ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ఇద్దరు కొడుకులు అహ్మద్ ఇబ్రహీం, ఇంసత్ అహ్మద్ ఆత్మాహుతి దాడికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. షాంగ్రీలా హోటల్ లోఇబ్రహీం, సిన్నమొన్ హోటల్ లో ఇంసత్ దాడి చేసినట్టు భావిస్తున్నారు.
