హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు, కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి శ్రీరాంరెడ్డి విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో సేకరించిన ఫోన్ నంబర్ల ఆధారంగా శ్రీరాంరెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం బషీర్బాగ్లోని ఓల్డ్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిట్ విచారణకు శ్రీరాంరెడ్డి హాజరయ్యారు. ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలోని సిట్ బృందం ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేసింది. 2022 నుంచి 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు శ్రీరాంరెడ్డికి చెందిన రెండు మొబైల్ నంబర్లను నాటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ నేతృత్వంలోని స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్(ఎస్వోటీ) మానిటిరింగ్ చేసింది.
రేవంత్రెడ్డి కుటుంబానికి నమ్మకస్తుడు!
కొడంగల్ నియోజకవర్గంలోని దౌల్తాబాద్ కాంగ్రెస్ ఇన్చార్జ్గా శ్రీరాం రెడ్డి సుదీర్ఘ కాలంగా పనిచేశారు. కొన్నేళ్లుగా సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఆయన సోదరుడు తిరుపతిరెడ్డికి అత్యంత నమ్మకస్తుడిగా ఆయన కొనసాగుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డి సహా ఆయన కుటుంబ సభ్యుల వ్యక్తిగత వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలను శ్రీరాంరెడ్డి పర్యవేక్షించేవారని తెలిసింది. ఈ క్రమంలోనే అప్పటి ఇంటెలిజెన్స్, ఎస్ఐబీ విభాగం శ్రీరాంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు సిట్ గుర్తించింది.
