
- కొన్ని గంటల పాటు నిలిచిన పనులు
- సాయంత్రానికి పునరుద్ధరించిన అధికారులు
- ప్రాజెక్ట్ భద్రతపై అధ్యయానికి వచ్చిన నిపుణులు
- అధికారుల నిర్లక్ష్యంపై అసహనం
శ్రీశైలం, వెలుగు: శ్రీశైలం ప్రాజెక్టును స్టడీ చేసేందుకు వచ్చిన సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) సైంటిస్టులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. సర్వే కోసం మెటీరియల్ తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేసిన కేబుల్ వే ఆగిపోవడంతో కొన్ని గంటల పాటు పనులు నిలిచిపోయాయి. అయితే, సాయంత్రానికి కేబుల్ వేను పునరుద్ధరించడంతో సర్వే పనులు తిరిగి ప్రారంభం అయ్యాయి. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించి దాదాపు 50 ఏండ్లు కావస్తున్నది.
అలాగే, డ్యామ్ కింది భాగంలో ప్లంజ్ పూల్ ఏర్పడి ప్రాజెక్టుకు ముప్పుగా మారింది. ఈ రెండింటిపై సర్వే చేసి ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చేందుకు కొద్ది రోజులుగా సైంటిస్టులు సర్వేలు చేస్తున్నారు. మొదటిసారి గత నెల 20న ఈ టీమ్.. ప్రాజెక్టును పరిశీలించి వెళ్లిపోయింది. తాజాగా ప్రాజెక్టు వద్ద పూర్తి స్థాయిలో సర్వే చేసేందుకు మంగళవారం ఉదయం నలుగురు సభ్యులతో కూడిన బృందం, డ్యామ్ వద్దకు చేరుకున్నారు. ముందుగా సైంటిస్టులు జలాశయంలో సర్వే చేపట్టేందుకు డ్యామ్ వెనుక భాగంలో అందుబాటులో ఉన్న బోటును ముందు భాగానికి కేబుల్ వే ద్వారా చేర్చారు. ఆ తర్వాత సర్వేకు సంబంధించిన మెటీరియల్ను బోటులో తరలించేందుకు అన్ని సిద్ధం చేయగా.. కేబుల్ వేలో సాంకేతిక లోపం తలెత్తి ఆగిపోయింది.
దీంతో ఉదయం నుంచి సర్వే పనులకు ఆటకం ఏర్పడింది. వెంటనే అలర్ట్ అయిన ఇరిగేషన్ ఆఫీసర్లు టెక్నీషియన్లను పిలిపించారు. సాయంత్రానికి రిపేర్లు చేసి కేబుల్ వేను పునరుద్ధరించారు. అనంతరం సర్వేకు సంబంధించిన మెటీరియల్ను కేబుల్ వే ద్వారా డ్యామ్ దిగువకు తరలించారు. కాగా, సర్వేకు సైంటిస్టులు వస్తున్నారనే సమాచారం ముందే ఉన్నా.. డ్యామ్ అధికారులు కేబుల్ వేను టెస్ట్ చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.