
సృష్టి హాస్పిటల్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. హాస్పిటల్ నుంచి భారీ సంఖ్యలో ఫైల్స్ సేకరించి వెరిఫై చేస్తున్నారు పోలీసులు. గతంలో IVF తో పాటు సరోగసి కింద సంతానం పొందిన దంపతుల వివరాలను సేకరించారు పోలీసులు. సృష్టి హాస్పిటల్ ద్వారా సంతానం పొందిన దంపతులు పోలీసుల ఫోన్ రాగానే కట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సృష్టి వ్యవహారం కలకలం రేపిన క్రమంలో తమ విషయంలో కూడా ఇలాంటి తప్పిదాలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతో దంపతులు ఫోన్లు స్విచ్ఆఫ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
సృష్టి హాస్పిటల్ కి సంబంధించి హైదరాబాద్ లోని కూకట్ పల్లి, కొండాపూర్ లో కూడా బ్రాంచ్ లు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆ బ్రాంచ్ ల నుంచి కూడా వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. ఇదిలా ఉండగా.. ఈ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి అసలు టెస్ట్ ట్యూబ్ బేబీ పద్దతి జరగలేదని..వేరే వాళ్లకు పుట్టిన బిడ్డను తీసుకొచ్చి దంపతులకు ఇచ్చినట్లు పోలీసులు తేల్చారు. టెస్ట్ ట్యూబ్ బేబీకి దంపతుల నుంచి డాక్టర్ నమ్రత 40 లక్షల వరకు తీసుకున్నట్లు చెప్పారు.
ఈ కేసు వివరాలను వెల్లడించిన నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ ..గోపాలపురం లో ఓ జంట ఇచ్చిన ఫిర్యాదుతో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పై రైడ్ చేశాం. ఆన్ లైన్ లో సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ గురించి తెలుసుకుని రాజస్థాన్ కు చెందిన ఓ జంట అప్రోచ్ అయ్యింది. సరోగసి పద్ధతిలో పిల్లలు పుట్టించేందుకు రూ. 30 లక్షలు అవుతాయని డాక్టర్ నమ్రత దంపతులకు చెప్పారు. దీంతో దంపతులిద్దరు విజయవాడ వెళ్ళి అక్కడ శ్యాంపిల్ ఇచ్చారు. సరోగసి కోసం అద్దె గర్భం మోసే మహిళ దొరికింది అని డాక్టర్ చెప్పారు.
►ALSO READ | రాష్ట్రంలో వర్షాలకు బ్రేక్.. ఎప్పటి దాకా కురిసే ఛాన్స్ లేదంటే..
కొన్ని నెలల తర్వాత బాబు పుట్టాడని ఆ జంటకి చెప్పారు డాక్టర్ నమ్రత. సిజేరియన్ ద్వారా డెలివరీ అయ్యిందని చెప్పి మరో రూ. 10 లక్షలు అదనంగా వసూలు చేశారు. కొన్ని నెలల తర్వాత దంపతులకు బాబు పోలికలు అనుమానాస్పదంగా అనిపించాయి. డీఎన్ఏ టెస్ట్ చేయాలని డాక్టర్ ను అడిగారు. ఇందుకు నమ్రత ఒప్పుకోలేదు. దీంతో దంపతులు ఢిల్లీలో డీఎన్ ఏ టెస్ట్ చేయించారు. మరొకరి డీఎన్ ఏగా తేలడంతో డాక్టర్ నమ్రత ను నిలదీశారు. అయితే దంపతులపై నమ్రత తన కొడుకు జయంత్ తో కలిసి బెదిరింపులకు పాల్పడ్డారు.
వేరే మహిళకి పుట్టిన బిడ్డను తీసుకొచ్చి సరోగసి ద్వారా మీకు పుట్టిన బిడ్డ అని దంపతులను నమ్మించారు డాక్టర్ నమ్రత. ఢిల్లీకి చెందిన ఓ గర్భిణిని ఫ్లైట్ లో వైజాగ్ తీసుకొచ్చారు. అక్కడ డెలివరీ చేశారు..ఆమెకు పుట్టిన బిడ్డను వాళ్లకు ఇచ్చారు. బిడ్డను వద్దనుకున్న ఆ మహిళకు రూ. 90 వేలు ఇచ్చారు. డాక్టర్ నమ్రతపై రెండు రాష్ట్రాల్లో 10 కి పైగా కేసులు ఉన్నాయి. IVF ఫెయిల్యూర్, సరోగసిలో అక్రమాలు వంటి కేసులు నమ్రత పై ఉన్నాయి. ఈ కేసులో ఇంకా చాలా మంది పాత్ర ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి. ఈ తరహా యాక్టివిటీస్ కు పాల్పడితే కట్టిన చర్యలు తీసుకుంటాము. ఈ కేసుల్లో 8 మందిని అరెస్ట్ చేసాము. ఏడుగురిని రిమాండ్ కు తరలించామనని తెలిపారు.