మహేశ్ తో మూవీ కన్ఫర్మ్ చేసిన రాజమౌళి

మహేశ్ తో మూవీ కన్ఫర్మ్ చేసిన రాజమౌళి

మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో సినిమా కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న అభిమానులకు బిగ్ న్యూస్. మహేష్‌‌ హీరోగా జక్కన్న దర్శకత్వంలో సినిమా కన్ఫర్మ్ అయింది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ఇదే కానుంది. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళే ప్రకటించారు. నిజానికి ఇది కొత్త విషయమేమీ కాదు. మహేష్ బాబు హీరోగా తాను ఓ సినిమా చేయనున్నానని, దుర్గా ఆర్ట్స్ అధినేత కె.ఎల్.నారాయణ నిర్మాణంలో ఈ చిత్రం ఉంటుందని రాజమౌళి ఇప్పటికే చాలాసార్లు ప్రకటించారు. ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ కూడా పలుమార్లు ఈ సినిమా గురించి ప్రస్తావించారు. మహేష్ సైతం రాజమౌళితో సినిమా ఉంటుందని చాలాసార్లు ఇంటర్వ్యూల్లో చెప్పాడు. అయితే ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా సెట్స్​ వరకు వెళ్లలేదు. దీంతో అసలు ఈ కాంబినేషన్లో సినిమా ఉంటుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. వీటన్నింటిపై స్పష్టతనిస్తూ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తన సినిమా మహేష్ తోనే అని తాజాగా ప్రకటించాడు రాజమౌళి. తరణ్ ఆదర్శ్ లాంటి బాలీవుడ్ సినీ విశ్లేషకులు సైతం ఈ ప్రాజెక్ట్ గురించి ట్వీట్ చేశారు. 2022 లో ఈ సినిమా సెట్స్ కి వెళ్తుందని చెబుతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కానుంది. ఆ లెక్కన మహేష్ మూవీ ప్రీ ప్రొడక్షన్ కే ఏడాది సమయం తీసుకోనున్నారు రాజమౌళి. ఈలోపు తన కమిట్​మెంట్స్ కంప్లీట్ చేసుకోనున్నాడు మహేష్. ఏదేమైనా మరో రెండేళ్లకు ఈ సినిమా ప్రారంభం కావచ్చేమో. సోషియో ఫ్యాంటసీ, హిస్టారికల్ టచ్ ఉన్న ఫిక్షన్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ అయిన జక్కన్న.. మహేష్ తో ఎలాంటి సినిమా చేయనున్నాడో మరి.