‘బాహుబలి’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ‘ఆర్ఆర్ఆర్’తో మరో భారీ ప్యాన్ ఇండియా సక్సెస్ను అందుకున్నారు రాజమౌళి. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందిన ఈ మూవీ ఇటీవల జపాన్లోనూ విడుదలై మెప్పించింది. ఎన్నో రికార్డులను తన అకౌంట్లో వేసుకుంటూ ఆస్కార్ అవార్డులకూ పోటీ పడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉండబోతోంది అంటున్నారు జక్కన్న.
అమెరికాలోని చికాగోలో ‘ఆర్ఆర్ఆర్’ స్పెషల్ స్క్రీనింగ్స్ జరుగుతున్నాయి. అందులో పాల్గొన్న రాజమౌళి... దీనికి సీక్వెల్ తీయాలని తనకూ ఉందని, ఇందుకు సంబంధించి ఇప్పటికే తన తండ్రి విజయేంద్ర ప్రసాద్తో డిస్కస్ చేశానని, ప్రస్తుతం ఆయన స్టోరీపై వర్క్ చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. తన నెక్స్ట్ మూవీని మహేష్తో చేయబోతున్న రాజమౌళి, వచ్చే ఏడాది షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. అది పూర్తయ్యాక ఈ సీక్వెల్ మొదలయ్యే అవకాశాలున్నాయి.