కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం అమలు చేస్తున్న లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన టెన్త్ పరీక్షల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. జూలై నెలలో విద్యార్థులకు ఎగ్జామ్స్ పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని సోమవారం మీడియాకు వెల్లడించారు ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్. 10వ తరగతి పరీక్షల నిర్వహణకు అన్నీ ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. కొద్ది రోజుల్లోనే డిటైల్డ్ షెడ్యూల్ విడుదల చేస్తామని తెలిపారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ పిల్లలు పరీక్ష రాసేలా సెంటర్లలో ఏర్పాట్లు చేస్తామన్నారు. విద్యార్థులకు ప్రిపరేషన్ కోసం సరైన సమయం ఉండేలా ముందుగానే డేట్ప్ ప్రకటిస్తామని చెప్పారు.
వాస్తవానికి ఏపీలో మార్చి 23 నుంచి టెన్స్ పరీక్షలు ఉంటాయని తొలుత ఎస్ఎస్సీ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఆ ఎగ్జామ్స్ ను వాయిదా వేసింది ఏపీ ప్రభుత్వం. దీంతో మార్చి 31 నుంచి పరీక్షలు నిర్వహించేందుకు కొత్త షెడ్యూల్ ఇచ్చింది బోర్డు. అయితే కరోనా కారణంగా ఎన్నికలు, ఎగ్జామ్స్ కూడా వాయిదా పడ్డాయి.