జనగామ జిల్లా హాస్పిటల్లో ఖాళీలు ఎక్కువ.. సేవలు తక్కువ..!

జనగామ జిల్లా హాస్పిటల్లో ఖాళీలు ఎక్కువ.. సేవలు తక్కువ..!
  • జనగామ జిల్లా హాస్పిటల్​లో సిబ్బంది కొరత
  • అప్​గ్రేడ్​ అయినా పెరగని వసతులు
  • ఎన్​ఎంసీ ఆదేశాలతో ఖాళీలపై నివేదిక
  • రెండు మూడు రోజుల్లో రానున్న ఎన్ఎంసీ బృందం

జనగామ, వెలుగు : జనగామ జిల్లా హాస్పిటల్​లో సిబ్బంది కొరత వెంటాడుతోంది. ఏరియా హాస్పిటల్​గా ఉండగా, జిల్లా ఆస్పత్రిగా అప్​గ్రేడ్​ చేసి వైద్యవిధాన పరిషత్​ నుంచి డీఎంఈ పరిధిలోకి తెచ్చారు. కానీ, వసతుల కల్పనపై మాత్రం శ్రద్ధ చూపలేదు. చంపక్​ హిల్స్​ ఎంసీహెచ్ హాస్పిటల్లోనూ స్టాఫ్​ కొరతతో ఉన్న సిబ్బందిపై పనిభారం పెరిగింది.​ అవసరమైన సిబ్బంది లేక వైద్య సేవలపై ప్రభావం పడుతోంది.

సౌకర్యాల కొరత..

జనగామ జిల్లా ఆస్పత్రి నిత్యం రద్దీగా ఉంటుంది. హైదరాబాద్– వరంగల్, సూర్యాపేట–సిద్దిపేట హైవేలకు దగ్గరగా ఉండడంతో ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. రోడ్డు ప్రమాదాలతోపాటు యాదాద్రి, సిద్దిపేట జిల్లాకు చెందిన పలు మండలాల వారు ఇక్కడికే వస్తుంటారు. జనగామ గవర్నమెంట్​ మెడికల్​ కాలేజీకి అనుబంధంగా పనిచేస్తున్న ఈ ఆస్పత్రిలో 300లకు పైగా పడకలు ఉండాల్సి ఉంది. ఇంకా 100 పడకలతోనే నడిపిస్తున్నారు. రోగుల తాకిడీ రోజురోజుకు పెరుగుతున్నా సౌకర్యాలు అంతంత మాత్రమే ఉన్నాయి. మెడికల్​ కాలేజీ మొదటి, రెండో సంవత్సరం పూర్తి కాగా, మరో రెండు నెలల్లో మూడో ఏడాది ప్రారంభంకానుంది.

 ఈ నేపథ్యంలో ఇటీవల ఎన్ఎంసీ ఇక్కడి సౌకర్యాలపై ఆరా తీసింది. 8 కేటగిరీల్లో లోపాలున్నట్లు గుర్తించి ఈనెల 14 షోకాజ్​ నోటీసులు ఇచ్చింది. దీనిపై మరుసటి రోజు నిర్వహించిన వర్చువల్​ మీటింగ్​లో మెడికల్​ కాలేజీ ప్రిన్సిపాల్​ గోపాల్​రావు వివరణ ఇచ్చారు. ఇదే క్రమంలో ఒకటి, రెండు రోజుల్లో మళ్లీ ఎన్ఎంసీ బృందం ఆస్పత్రిని, మెడికల్​ కాలేజీని సందర్శించనుంది. ఎన్ఎంసీ ఆదేశాల మేరకు ఉండాల్సిన ఉద్యోగులు, వసతులు, ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు, వసతులపై సమగ్ర నివేదిక తయారీలో యంత్రాంగం నిమగ్నమైంది.

ఖాళీల పై కసరత్తులు..

పక్కా బిల్డింగ్​ నిర్మాణం కాకుండానే గత సర్కారు హయాంలో జనగామ మెడికల్​ కాలేజీని ప్రారంభించారు. దీంతో తాత్కాలిక షెడ్లలో కాలేజీని రన్​ చేస్తున్నారు. మొదటి, రెండవ సంవత్సర విద్యకు షెడ్లు సరిపోగా, రెండు నెలల్లో స్టార్ట్​ అయ్యే మూడో ఏడాది క్లాసుల కోసం ప్రైవేటు బిల్డింగ్​ల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. మెడికల్​ కాలేజీలో విద్యా బోధనకు అవసరమైన ఫ్యాకల్టీ విషయంలో పెద్దగా సమస్యలు లేకున్నప్పటికీ కొరత ఉంది. జిల్లా ఆస్పత్రి, ఎంసీహెచ్​లలో స్టాఫ్, బెడ్ల కొరత నెలకొంది. జిల్లా హాస్పిటల్లో 170 వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కీలకమైన మెడికల్​ సూపరింటెండెంట్​పోస్టు సైతం ఖాళీగా ఉండగా, మెడికల్​ కాలేజీ ప్రిన్సిపల్​ ఇన్​చార్జిగా వ్యవహరిస్తున్నారు. 

మెడికల్​ ఆఫీసర్లు, క్యాజువాలిటీ మెడికల్​ఆఫీసర్ల పోస్టులూ ఖాళీగానే ఉన్నాయి. సీఏఎస్​(ఆర్ఎంవో)లు నాలుగు పోస్టులకు ఒక్కరే ఉన్నారు. ముగ్గురు సీనియర్​ అసిస్టెంట్లకు ఒక్కరు, జూనియర్​ అసిస్టెంట్లు ఏడుగురికి ఇద్దరే ఉన్నారు. ల్యాబ్​ టెక్నీషియన్​ గ్రేడ్​–1కు 5, గ్రేడ్–2కు 17 పోస్టులకు మొత్తం ఖాళీగా ఉన్నాయి. ఫార్మసిస్ట్​ గ్రేడ్​ -2 నాలుగు పోస్టులకు మొత్తం ఖాళీగా ఉన్నాయి. నర్సింగ్​ సూపరింటెండెంట్​ గ్రేడ్-​ 1 ఉన్న ఒక్క పోస్టు ఖాళీగా ఉంది. డిప్యూటీ సూపరింటెండెంట్​ గ్రేడ్-​ 2 మూడు పోస్టులకు ఇద్దరు ఉండగా, ఒకటి ఖాళీగా ఉంది. స్టాఫ్ నర్స్​లు 203కు 174 ఉండగా, 29 ఖాళీలతో పాటు తదితర పోస్టులు ఖాళీగా 
ఉన్నాయి. 

నివేదిక రూపొందిస్తున్నం 

జనగామ మెడికల్​ కాలేజీ, అనుబంధంగా ఉన్న జిల్లా ఆస్పత్రి, ఎంసీహెచ్​లలో బెడ్లు, ఉద్యోగులు, వసతుల పై వాస్తవ నివేదిక రూపొందిస్తున్నం. కొరతను తీర్చేందుకు అవసరమైన ప్రతిపాదనలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తం. ఒకటి, రెండు రోజుల్లో ఎన్ఎంసీ బృందం విజిట్​చేయనుంది. వారికి ఈ నివేదికను సమర్పిస్తాం. ఉన్నంతలో మెరుగైన సేవలందిస్తున్నం.  

దుగ్యాల గోపాల్​రావు, ప్రిన్సిపల్, గవర్నమెంట్​మెడికల్​కాలేజీ, జనగామ