చైనా బోర్డర్‌‌లో మన ఎయిర్‌‌ఫోర్స్ మోహరింపు అట్లనే ఉంది

చైనా బోర్డర్‌‌లో మన ఎయిర్‌‌ఫోర్స్ మోహరింపు అట్లనే ఉంది

హైదరాబాద్: సీడీఎస్ హెలికాప్టర్ ప్రమాదంపై ఎంక్వైరీ అన్ని రకాల కోణాల్లో జరుగుతోందని, దీనికి సంబంధించిన రిపోర్ట్ వచ్చిన తర్వాత వీవీఐపీల ప్రోటోకాల్‌లో మార్పుల చేస్తామని ఎయిర్‌‌ ఫోర్స్ చీఫ్ ఎయిర్‌‌ మార్షల్ వివేక్ రామ్ చౌదరి తెలిపారు. హైదరాబాద్ శివారు దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పాసింగ్‌ ఔట్ పరేడ్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎయిర్ ఫోర్స్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. తమిళనాడులోని కూనూరు వద్ద సంభవించిన హెలికాప్టర్ ప్రమాదంలో సీబీఎస్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్, మరో పన్నెండు మంది వీర సైనికుల మృతిపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం దేశంలో ఎంతో విషాదాన్ని నింపిందన్నారు. ఆ ప్రమాద ఘటనపై ఎంక్వైరీ కొనసాగుతోందని, ఈ రిపోర్టు ఆధారంగా భవిష్యత్తులో వీవీఐపీ ప్రయాణాలకు సంబంధించిన ప్రొటోకాల్‌ను రివ్యూ చేసి, మార్పులు చేర్పులు చేస్తామని అన్నారు. పాక్, చైనాల నుంచి ఉన్న ముప్పుపై నిరంతరం నిఘా, పర్యవేక్షణ ఉంటుందని అన్నారు. ఎంక్వైరీ సాగుతున్న సమయంలో ముందే ఎటువంటి కామెంట్ చేయలేమని అన్నారు. అయితే ప్రతి కోణంలోనూ ఇన్వెస్టిగేషన్ జరగడం తప్పనిసరి అని, ఎక్కడ, ఎటువంటి పొరబాటు జరిగిందన్నది తేల్చి స్పష్టమైన రిపోర్ట్ ఇవ్వాల్సి ఉందని ఎయిర్‌‌ఫోర్స్ చీఫ్​ చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ చాలా నిష్పాక్షికంగా జరుగుతోందని తాను నమ్మకంగా చెప్పగలనని అన్నారు. 

చైనాను ఎదుర్కొనేందుకు సిద్ధం

సరిహద్దుల్లో చైనాతో నెలకొన్న ఉద్రిక్తతపై మాట్లాడుతూ ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోందన్నారు. కొన్ని ఏరియాల్లో బలగాల ఉపసంహరణలు పూర్తయినప్పటికీ లఢఖ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇంకా స్టాండాఫ్ కొనసాగుతోందని చెప్పారు. చైనా సరిహద్దులో ఎయిర్‌‌ఫోర్స్‌ మోహరింపు అవసరమైనంత కాలం అలానే ఉంటుందని వివేక్‌ రామ్ చెప్పారు. చైనాతో ఎటువంటి సవాళ్లు ఎదురైనా పూర్తి సంసిద్ధతతో ఉన్నామని తెలిపారు. మరోవైపు రాఫెల్ యుద్ధ విమానాల డెలివరీని సరైన సమయంలో చేస్తున్నందుకు ఫ్రాన్స్‌కు ఆయన ధన్యవాదాలు చెప్పారు. 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు మనం ఫ్రాన్స్‌తో ఒప్పందం చేసుకున్నామని, ఇప్పటికే 32 భారత్‌కు వచ్చేశాయని అన్నారు. మిగిలిన నాలుగు రాఫెల్స్‌లో మూడు ఫిబ్రవరిలో వచ్చేస్తాయని తెలిపారు.