పట్టాలెక్కిన 12 బోగీల MMTSలు

పట్టాలెక్కిన 12 బోగీల MMTSలు

12 కార్ రాక్ లు కలిగిన రెండు ఎంఎంటీఎస్ రైళ్లు బుధవారం ఉదయం పట్టాలెక్కాయి. గురువారం మరో రెండు రైళ్లను అధికారులు పట్టాలెక్కించనున్నారు. త్వరలో12 కార్ రాక్ లు ఉన్న మరికొన్ని రైళ్లను దశల వారీగా అందుబాటులోకి తేనున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 9 బోగీల రైళ్లకు మరో 3 బోగీలను జతచేయనున్నారు. రెండు నెలల్లో పూర్తిస్థాయిలో 12 బోగీల ఎంఎంటీఎస్  రైళ్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ప్రస్తుతం 9 బోగీల ఎంఎంటీఎస్ రైళ్లతో121 సర్వీసులు నడుపుతున్నారు.ఈ సర్వీసులు సికింద్రాబాద్– నాంపల్లి, సికింద్రాబాద్ – ఫలక్​నుమా, సికింద్రాబాద్– లింగంపల్లి, ఫలక్ నుమా – లింగంపల్లి మార్గాల్లో నడుస్తున్నాయి. ఒకరోజులో 1.80 లక్షల మందికి పైగా ఎంఎంటీఎస్ లలో ప్రయాణిస్తున్నారు. కొత్త బోగీలతో మరో 50 వేల మంది ప్రయాణించే అవకాశం లభించింది. ఇప్పుడ ఒక్కో ఎంఎంటీఎస్ లో దాదాపు 2,700 మంది ప్రయాణిస్తున్నారు. అదనపు బోగీలతో ఈ సంఖ్య 5,000లకు చేరనుంది.

ఇవీ ప్రత్యేకతలు…

దక్షిణ మధ్య రైల్వే కొత్తగా తీసుకొస్తున్న ఎంఎంటీఎస్‌‌ రైళ్లలో అత్యాధునిక సౌకర్యాలతో పాటు భద్రతకు పెద్దపీట వేసింది. కొత్తగా వస్తున్న 12 రైళ్లలో ఇప్పటికే 4  రైళ్లను సిద్ధం చేసింది. ఇప్పుడున్న 9 బోగీల ఎంఎంటీఎస్‌‌ రైళ్లలో 700 మంది కూర్చుని, 2 వేల మంది నిల్చుని ప్రయాణించే అవకాశం ఉంది. కొత్తగా వస్తున్న ఎంఎంటీఎస్‌‌ రైళ్లలో 1,150 మంది కూర్చుని, 4 వేల మంది నిల్చొని ప్రయాణించేందుకు అవకాశం కల్పించారు. మొత్తం మీద ఒకేసారి 5,150 మంది ప్రయాణించవచ్చు. మహిళా ప్రయాణికులకు కేటాయించిన బోగీల్లో సీసీ టీవీ కెమెరాలు ఉన్నాయి. ఎల్‌‌ఈడీ స్క్రీన్ లతో స్టేషన్ల వివరాలు, ప్రయాణికులకు సూచనలు అందుతుంటాయి. విశాలమైన ప్రవేశ ద్వారాలు పెట్టారు. పైనుంచి సహజసిద్ధంగా వెలుతురుండేలా బోగీలను తీర్చిదిద్దారు. ఆకట్టుకునే రంగులతో కొత్త రైళ్లను ఏర్పాటు చేశారు, సౌకర్యవంతంగా కూర్చునేలా రూపొందించారు. లేటెస్ట్​టెక్నాలజీతో బ్రేకింగ్‌‌ సిస్టమ్, ఇంజన్లు పాడవ్వకుండా జాగ్రత్తలు
తీసుకున్నారు.