అటవీ భూములు కావు.. ప్రభుత్వ భూములే.. కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకు ప్రభుత్వం

అటవీ భూములు కావు.. ప్రభుత్వ భూములే.. కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకు ప్రభుత్వం
  • కంచ గచ్చిబౌలి ల్యాండ్స్​పై సుప్రీంకు మరోసారి స్పష్టం చేసిన రాష్ట్ర సర్కార్
  • ఫారెస్ట్ ల్యాండ్  అంటూ సీఈసీ పేర్కొనడం కరెక్ట్​ కాదు
  • ఇండస్ట్రియల్ పార్కు​ల్లో మొక్కలు నాటుతున్నట్లు వెల్లడి
  • 43 అంశాలతో 56 పేజీల అడిషనల్​ అఫిడవిట్​ దాఖలు
  • కార్టోశాట్, గూగుల్ ఎర్త్ ఇమేజరీ, సెంటినల్ శాటిలైట్​ చిత్రాలు అటాచ్
  • అడవిని కాపాడకుంటే అధికారులు జైలుకే: సుప్రీంకోర్టు
  • అఫిడవిట్​పై స్పందించేందుకు టైం కోరిన అమికస్ క్యూరీ
  • విచారణ వచ్చే నెల 13కు వాయిదా

న్యూఢిల్లీ, వెలుగు: కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ అటవీ భూములు కావని, ప్రభుత్వ భూములేనని సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తేల్చిచెప్పింది. అందుకు సంబంధించి రెవెన్యూ డిపార్ట్ మెంట్ రికార్డులు, ఉమ్మడి ఏపీ ప్రభుత్వ హయాంలో రిలీజ్ చేసిన జీవోను సమర్పించింది. ఈ భూమిని ఫారెస్ట్ ల్యాండ్ గా ప్రకటించాలంటూ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ( సీఈసీ) పేర్కొన్న అంశాలు కరెక్ట్​ కావని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మొత్తం 43 అంశాలతో కూడిన 56 పేజీల అడిషనల్ అఫిడవిట్​ను రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎస్ రామకృష్ణారావు సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. 

2001లో అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ పేరుతో జారీ చేసిన జీవో నంబర్​ 538, 2006లో కంచ గచ్చిబౌలి కార్టోశాట్ ఇమేజరీ, 2024 లో తీసిన గూగుల్ ఎర్త్ ఇమేజరీ, 2025 ఏప్రిల్​లో సేకరించిన సెంటినల్ శాటిలైట్ డేటాను ఈ అఫిడవిట్​కు రాష్ట్ర ప్రభుత్వం జత చేసింది. క్షేత్రస్థాయిలో సేకరించిన వాస్తవాలు, ఇతర అంశాలతో కూడిన వివరాలను ఇందులో పొందుపరిచింది. సీఈసీ చెప్తున్నట్లు  కంచ గచ్చిబౌలి భూమి అటవీ భూమి కాదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గత అఫిడవిట్ లోనే ఈ అంశాన్ని పేర్కొన్నట్లు తెలిపింది. ‘‘ఈ భూములు ‘కంచ పోరంబోకు సర్కారీ’ భూములుగా 1954–55 లోనే రెవెన్యూ రికార్డుల్లో నమోదైంది. ఈ భూముల్ని ప్రభుత్వం అటవీ భూమిగా గుర్తించలేదు. 

‘కంచ’ అంటే వ్యవసాయానికి లేదా పబ్లిక్ పర్పస్ ఉపయోగించని భూమి.  2001లో అక్టోబర్​లో ఆనాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రూపొందించిన మాస్టర్ ప్లాన్ లో ‘పబ్లిక్ అండ్ సెమీ పబ్లిక్ యూజ్’ కింద ఈ భూమిని పేర్కొంది. 2007 నుంచి ఈ భూమి వ్యవహారం కోర్టులో నడించింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ప్రభుత్వానికే భూమి చెందుతుందని  కోర్టు తీర్పు ఇచ్చింది. గతంలో నుంచి వాడకంలో లేకపోవడంతో ఈ భూమిలో దట్టంగా అడవి ఏర్పడినట్లు కార్టోశాట్, గూగుల్ ఎర్త్ ఇమేజరీ, సెంటిసెల్ శాటిలైజ్ చిత్రాలు చూపుతున్నాయి” అని అఫిడవిట్​లో వివరించింది. 

768 ఎకరాల విస్తీర్ణంలో 2000 ఏడాది నుంచి నానక్ రాంగూడ, మాదాపూర్, రాయదుర్గం ప్రాంతాలను ఐటీ జోన్లుగా తీర్చిదిద్దే ప్రయత్నాలను అప్పట్లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం.. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందని రాష్ట్ర సర్కార్​ తెలిపింది. ఈ క్లస్టర్లలో దాదాపు రూ. 99, 880 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, తద్వారా 7.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కాయని పేర్కొంది. ఇది హైదరాబాద్​ను గ్లోబల్ క్యాపబిలిటి సెంటర్ల (జీసీసీ)  గమ్యస్థానంగా మారుస్తున్నదని తెలిపింది. 2024 లో కొత్తగా 70 జీసీసీలను ఆకర్షించినట్లు వివరించింది. దీంతో రూ. 16, 000 కోట్ల పెట్టుబడులు, 84 వేల మందికి జాబ్స్ వస్తాయని తెలిపింది. అందువల్ల ఈ 400 ఎకరాల్లో సుస్థిర అభివృద్ధికి ప్రణాళికలు వేసినట్లు  పేర్కొంది. 

అడవిని కాపాడకుంటే అధికారులు జైలుకే: సుప్రీం

కంచ గచ్చిబౌలి వివాదాస్పద స్థలంలో అడవిని కాపాడకుంటే అధికారులను అక్కడే టెంపరరీ జైలుకు పంపుతామని సుప్రీంకోర్టు మరోసారి తేల్చిచెప్పింది. కంచ గచ్చిబౌలి భూ వ్యవహారంలో సుమోటో కేసుతో పాటు బీ ఫర్‌‌‌‌‌‌‌‌ ది చేంజ్‌‌‌‌‌‌‌‌ సొసైటీ, ఇతరుల ఇంప్లీడ్ పిటిషన్లపై బుధవారం సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్​ నేతృత్వంలోని జస్టిస్ కె వినోద్ చంద్రన్, జస్టిస్ జోమలయ బగ్చీతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. తొలుత ప్రభుత్వం తరపు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ... ‘‘ఈ కేసుకు సంబంధించి తాజాగా సమగ్ర అంశాలతో మరో అఫిడవిట్ దాఖలు చేశాం. ఈ అఫిడవిట్​లో ఫొటోలతో కూడిన సమాచారం అందించాం. ప్రస్తుతం కంచ గచ్చిబౌలిలో  పనుల్ని ఆపేసాం. 

అక్కడ ఏమీ జరగడం లేదు’’ అని  నివేదించారు. దీనిపై అమికస్ క్యూరీ పరమేశ్వర్, మరో అడ్వకేట్ దామా శేషాద్రి స్పందిస్తూ..  తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన  అఫిడవిట్ పరిశీలనకు సమయం కావాలని కోరారు. ఈ సందర్భంగా సీజేఐ బెంచ్ జోక్యం.. తదుపరి విచారణను ఆగస్టు 13కు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. తదుపరి విచారణ తేదిన ప్రకటించిన అనంతరం సీజేఐ పలు వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రస్తుతానికి అడవిని కాపాడారు కదా?’’ అని అన్నారు. సింఘ్వీ జోక్యం చేసుకొని.. అసలు ఆ భూమి ఫారెస్ట్ దా? కాదా? అన్న అంశంపై విచారణ జరగాల్సి ఉందన్నారు. 

ఇందుకు మరోసారి సీజేఐ స్పందిస్తూ.. ‘‘అది ఏమైనా.. ప్రస్తుతానికి చెట్ల నరకకుండా రక్షించబడ్డాయి. అభివృద్ధి కోసం అడవులను నరకడం సమంజసం కాదు. రాత్రికి రాత్రి బుల్డోజర్ పెట్టి అడవిని నరికేశారు. సుస్థిర అభివృద్ధి కోసం నేను అడ్వకేట్ చేస్తున్నా. అడవిని కాపాడుకుంటే... అధికారులను అక్కడే టెంపరరీ జైలుకు పంపుతాం’’ అని చెప్పారు.  అయితే..  గత విచారణ సందర్భంగా కోర్టు ఆదేశాలకు కట్టుబడి అన్ని పనులు నిలిపివేసినట్లు మరోసారి బెంచ్ కు సింఘ్వీ తెలిపారు.

ఇండస్ట్రియల్ పార్కుల్లో లక్షకు పైగా మొక్కలు

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇండస్ట్రియల్ పార్కులు, ఇతర చోట్ల 1.23 లక్షల మొక్కలు నాటుతున్నట్టు అడిషనల్ అఫిడవిట్​లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇందులో మేడ్చల్-సిద్దిపేట, శంషాబాద్, పటాన్ చెరు, సైబరాబాద్​లో 40, 500 మొక్కలు నాటనున్నట్లు వివరించింది.  అలాగే, 2.13 కోట్లతో ఎస్​ఎఫ్​పీజీ వరంగల్, యెంకతల, గోల్కొండ ఆర్టిలరీ సెంటర్, జహీరాబాద్ నిమ్జ్​లో 82,500 మొక్కలు నాటుతున్నట్లు తెలిపింది. వీటితో పాటు ఓఆర్ ఆర్​ ఇన్ సైడ్, ఔట్ సైడ్​లో మొత్తం 135 ఎకరాల్లో మొక్కలు నాటుతున్నట్లు సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా అఫిడవిట్​కు జతచేసింది.