మానేరు రివర్ ఫ్రంట్ పై విజిలెన్స్!..పనులు పూర్తికాకముందే రూ.226 కోట్ల బిల్లుల చెల్లింపుపై అనుమానాలు

మానేరు రివర్ ఫ్రంట్ పై విజిలెన్స్!..పనులు పూర్తికాకముందే రూ.226 కోట్ల బిల్లుల చెల్లింపుపై అనుమానాలు
  • నదిలో రాళ్లు పగులగొట్టకుండానే రూ.30 కోట్లు డ్రా చేశారనే ఆరోపణలు
  • రివర్  ఫ్రంట్  పనుల్లో అక్రమాలపై విచారణ జరపాలనే డిమాండ్లు
  • ఇప్పటికే కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులపై ఎంక్వైరీ మొదలుపెట్టిన విజిలెన్స్  ఆఫీసర్లు
  • త్వరలోనే మానేరు రివర్ ఫ్రంట్ పైనా విచారణకు సర్కారు రెడీ

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ లో  బీఆర్ఎస్  సర్కార్  హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్  ఫ్రంట్  పనుల్లో అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. గతంలో కాంగ్రెస్  నాయకుల ఫిర్యాదుల నేపథ్యంలో ఇప్పటికే కేబుల్  బ్రిడ్జి పనుల ఎస్టిమేషన్, టెండర్లు, బ్రిడ్జి నిర్మాణం, అప్రోచ్  రోడ్ల నిర్మాణంపై విజిలెన్స్  విచారణ కొనసాగుతుండగా.. సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకట్ రెడ్డి ఫిర్యాదుతో త్వరలోనే మానేరు రివర్  ఫ్రంట్  పనులపై విజిలెన్స్  విచారణకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.

రూ.769 కోట్లతో చేపట్టిన ఈ రెండు ప్రాజెక్టులపై చాలా కాలంగా బీఆర్ఎస్  యేతర  రాజకీయ పక్షాల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నేషనల్  గ్రీన్  ట్రిబ్యునల్(ఎన్జీటీ)ఇచ్చిన స్టేతో సుమారు ఏడాదిన్నరపాటు నిలిచిపోయిన పనులు.. స్టే వెకేట్  చేయడంతో ఈ ఏడాది ఏప్రిల్  ఫస్ట్  వీక్ లో మళ్లీ ప్రారంభమయ్యాయి. అప్పట్లో ఈ పనులపై ఎంక్వైరీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ నేత, మాజీ మేయర్  సునీల్ రావు లేఖ రాయగా.. తాజాగా సీపీఐ జాతీయ నేత చాడ వెంకట్ రెడ్డి స్వయంగా సీఎంను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వం కేబుల్  బ్రిడ్జి తరహాలోనే రివర్  ఫ్రంట్ పైనా విజిలెన్స్  ఎంక్వైరీకి  రెడీ కావడం చర్చనీయాంశంగా మారింది. 

రూ.220 కోట్ల బిల్లుల చెల్లింపుపై అనుమానాలు.. 

కరీంనగర్ లోని లోయర్  మానేరు డ్యామ్  గేట్లకు దిగువ భాగంలో ఇరిగేషన్  శాఖ మానేరు నదికి ఇరువైపులా 3.7 కిలోమీటర్ల మేర బండ్ తో కూడిన ప్రొటెక్షన్  వాల్స్ నిర్మాణం చేపట్టింది. ఇందుకోసం 2021 జూన్ లో రూ.310.464 కోట్లు కేటాయిస్తూ పరిపాలన అనుమతులు మంజూరు చేసింది.  ఆ తర్వాత 2023లో సెకండ్  ఫేస్  పనుల కోసం 2023 ఆగస్టులో మరో రూ.234 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు రూ.545.18 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ప్రొటెక్షన్  వాల్  నిర్మాణం పూర్తి కాలేదు. ఇంకా పనులు కొనసాగుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో లోయర్  మానేరు గేట్లు మొత్తం ఎత్తితే  4 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే ప్రమాదముందని, దీనిని తట్టుకుని ఉండేలా ప్రొటెక్షన్  వాల్  ఉండే పరిస్థితి లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గతంలో లక్ష క్యూసెక్కుల వరదకే కేబుల్  బ్రిడ్జికి సమీపంలోని చెక్  డ్యామ్  కొట్టుకుపోయిందని, ప్రొటెక్షన్  వాల్  విషయంలోనూ ఇదే తప్పు చేస్తున్నారనే విమర్శలున్నాయి. మానేరు రివర్  ఫ్రంట్  పనులు చేపట్టిన కాంట్రాక్టర్ కు ఇప్పటికే  రూ.220 కోట్ల బిల్లులు విడుదల చేయడంలో అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జరిగిన పనులకు, చెల్లించిన బిల్లులకు సంబంధం లేదనే విమర్శలున్నాయి. అలాగే  మరో రూ.136.15 కోట్లతో  మిగతా ప్రొటెక్షన్‌ వాల్స్‌ నిర్మాణానికి టెండర్  పిలవగా మళ్లీ పాత కాంట్రాక్టరే పనులు చేపట్టడం గమనార్హం. అలాగే గతంలో కూలిన చెక్ డ్యామ్  ఘటనలో కాంట్రాక్టర్, ఇంజనీర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే  మళ్లీ రూ.59.81 కోట్లతో పనులు చేపట్టడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. 

కేబుల్ బ్రిడ్జి వర్క్స్​పై విజిలెన్స్ ఎంక్వైరీ

కరీంనగర్–సదాశివపల్లి మధ్య వరంగల్  మార్గంలో రాకపోకలు సాగించడంతో పాటు టూరిజం అట్రాక్షన్ గా నిలిపేందుకు 500 మీటర్ల కేబుల్  బ్రిడ్జితో పాటు డైనమిక్  లైటింగ్  సిస్టం, అప్రోచ్  రోడ్డుతో కలిపి రూ.224 కోట్లతో పనులు పూర్తి చేశారు. అయితే 2023 జూన్ 23న ప్రారంభించిన కొన్నాళ్లకే బ్రిడ్జిపై రెయిలింగ్ బీటలువారడం, తారు లేచిపోవడం, డైనమిక్  లైటింగ్  సిస్టం పని చేయకపోవడంతో మూణ్నాళ్ల ముచ్చటగా మారింది. ఈ క్రమంలోనే నిరుడు కాంగ్రెస్  నాయకులు ఇచ్చిన ఫిర్యాదుతో సర్కారు విజిలెన్స్  ఎంక్వైరీకి ఆదేశించింది. విజిలెన్స్  అండ్  ఎన్‌ఫోర్స్ మెంట్  ఆర్అండ్ బీ విభాగం డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరుగుతున్న విచారణ తుది దశకు చేరుకున్నట్లు తెలిసింది. 

మానేరులోకే కరీంనగర్  డ్రెయినేజీ వాటర్..

కరీంనగర్‌ సిటీ నుంచి వచ్చే మూడు మెయిన్  డ్రైనేజీలు ప్రస్తుతం నేరుగా మానేరు నదిలోనే కలుస్తున్నాయి. ఈ డ్రెయినేజీ నీళ్లు నేరుగా కలవకుండా ఉండేందుకు సీవేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్(ఎస్టీపీ) ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ, ఇప్పటి వరకు ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభం కాలేదు.