త్వరలోనే విద్యుత్​ కమిషన్​కు కొత్త చైర్మన్​

త్వరలోనే విద్యుత్​ కమిషన్​కు కొత్త చైర్మన్​
  • సుప్రీంకోర్టు తీర్పుతో రాష్ట్ర సర్కారు నిర్ణయం
  •  ప్రపోజల్స్​ రెడీ చేస్తున్న అధికారులు
  • పవర్ కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కావాల్సిందే అంటున్న ఎక్స్​పర్ట్స్

హైదరాబాద్, వెలుగు: విద్యుత్ కొనుగోళ్లు, యదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్​పై ఏర్పాటు చేసిన ఎంక్వైరీ కమిషన్​కు కొత్త చైర్మన్​ను నియమించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. నాలుగైదు రోజుల్లోనే మరో కొత్త రిటైర్డ్ జడ్జిని నియమించాలని.. ఈ మేరకు ప్రపోజల్స్ రెడీ చేయాలని ఉన్నతాధికారులు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం. ఎవరిని నియమించాలనే దానిపై నాలుగైదు పేర్లను పరిశీలిస్తున్నారు. విద్యుత్ కమిషన్​పై మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. 

అయితే ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు, విచారణపై సుప్రీం కోర్టు ఎక్కడా అభ్యంతరం చెప్పలేదు. మీడియాతో జస్టిస్ నరసింహారెడ్డి మాట్లాడిన నేపథ్యంలో ఆయన స్థానంలో మరొకరిని నియమించుకోవాలని తెలిపింది. దీంతో జస్టిస్ నరసింహరెడ్డి విద్యుత్ కమిషన్ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. ఇప్పటికే చత్తీస్​గఢ్ విద్యుత్ కొనుగోళ్లు, యదాద్రి పవర్​ ప్లాంట్​పై 90% ఎంక్వైరీ పూర్తి చేసినట్లు తెలిసింది. జూన్ నెలఖారుకే కమిషన్ రిపోర్టు ఇవ్వాలి. కొంత ఎంక్వైరీ మిగిలి ఉండటంతో ప్రభుత్వం నెల రోజులు గడువు పొడిగించింది. ఇప్పుడు జస్టిస్ నరసింహరెడ్డి స్థానంలో వెంటనే ఇంకొకరిని నియమించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది.

మాజీ సీఎం కమిషన్ ముందుకు రావాల్సిందేనా

సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్​తో విద్యుత్ కమిషన్​కు మరింత బలం చేకూరినట్లయిందని లీగల్ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. ఈ అంశం కేసీఆర్​కే రివర్స్ అయినట్లు చెప్తున్నారు. ఈసారి విద్యుత్ కమిషన్ విచారణకు తప్పనిసరిగా హాజరు కావాల్సిన అనివార్యత ఏర్పడింది. కేసీఆర్​కు కమిషన్ ఇప్పటికే రెండుసార్లు నోటీసులు ఇచ్చింది. ఈ విచారణ ఎలా తప్పించుకోవాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. అందులో భాగంగానే విద్యుత్ కమిషన్ చట్టవిరుద్ధమని, దానిని రద్దు చేయాలని కోర్టుకు వెళ్లినట్టు తెలుస్తున్నది. 

కమిషన్ రద్దు చేయాలని, మీడియాతో మాట్లాడిన కమిషన్ రిటైర్డ్ జస్టిస్ నర్సింహారెడ్డి వెంటనే ఆ కమిషన్ నుంచి వైదొలగాలని, తనకు ఇచ్చిన విచారణ నోటీసులపై స్టే కోరుతూ ముందు కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరిస్తూ ఆయన పిటిషన్​ను డిస్మిస్ చేసింది. దీంతో కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు సబబేనని స్పష్టం చేసింది. కమిషన్ చైర్మన్ రిటైర్డ్ జస్టిస్​ నర్సింహారెడ్డి స్థానంలో త్వరలో ఇంకొకరు నియమితులవుతారని, ఆయన బాధ్యతల చేపట్టిన తర్వాత కమిషన్ విచారణ యథాతథంగా కొనసాగుతుందని లీగల్ ఎక్స్​పర్ట్స్ చెబుతున్నారు.