హైదరాబాద్: టీఆర్ఎస్ లాంటి గొప్ప పార్టీ దేశంలో మరొకటి లేదని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సుశిక్షితులైన సభ్యులు కలిగిన ఏకైక పార్టీ అని చెప్పారు. పాలకుర్తి నియోజకవర్గంలోని ధర్మపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు గురువారం హైదరాబాద్ లోని మంత్రి నివాసంలో దయాకర్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... పార్టీలోకి వచ్చిన వారికి తగిన గుర్తింపు, గౌరవం ఉంటుందన్నారు. పార్టీలో కలిసిపోయి ప్రజాసేవలో నిమగ్నం కావాలని సూచించారు. తాము చేసిన అభివృద్ధిని చూసే చాలా మంది టీఆర్ఎస్ లోకి వస్తున్నారని స్పష్టం చేశారు.
కేసీఆర్ పాలనలో రాష్ట్రం చాలా అభివృద్ధి చెందిందని, రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవని పేర్కొన్నారు. రైతు బంధు, దళిత బంధు, కళ్యాణ లక్ష్మి, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు వంటి పథకాలు పేదల బతుకుల్లో వెలుగులు నింపాయని చెప్పారు. ఇక టీఆర్ఎస్ లో చేరినవారిలో దేవరుప్పుల మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ కార్యదర్శి వంగాల చిన్న యాదయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వేషమల్ల వెంకటయ్య, దౌపాటి అయిలయ్య, దౌపాటి మహేశ్, పులిగిళ్ళ యాదగిరి, ఎండీ వాజిద్, ఎండీ ఇమామ్ పాషా, ఎండీ సలీం, మంద అశోక్, ఎండీ యాకూబ్, దౌపాటి పరశురాములు, వంగాల వెంకటమ్మ, వేషమల్ల కమలమ్మ తదితరులు ఉన్నారు.