కూతుర్ని కిడ్నాప్ చేసిగొంతు నులిమి…

కూతుర్ని కిడ్నాప్ చేసిగొంతు నులిమి…

ఏడేళ్ల కూతుర్ని కిడ్నాప్ చేసి గొంతు నులిమి చంపేసింది ఓ సవతి తల్లి. మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి ఉప్పుటేరులో పడేసింది. తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా కూతురు కనిపించట్లేదని భర్త చేత పోలీసులకు ఫిర్యాదు చేయించింది. పోలీసులు విచారణలో అసలు నిజం బయటపడింది. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఈ దారుణం జరిగింది. శ్యామ్ సుందర్, శాంతికుమారి దంపతులు కాకినాడలో నివాసం ఉంటున్నారు. మొదటి భార్య చనిపోవడంతో శ్యామ్ సుందర్ శాంతి కుమారిని రెండో పెళ్లి చేసుకున్నాడు. శ్యామ్ సుందర్ కు అప్పటికే ఏడేళ్ల కూతురు (దీప్తిశ్రీ) ఉంది. కొన్నాళ్లపాటు సంసారం బాగానే సాగింది. సవతి తల్లి శాంతికుమారి దీప్తిశ్రీని హింసించడం మొదలుపెట్టింది. దండించే నెపంతో దీప్తిశ్రీని రెండు సార్లు తీవ్రంగా గాయపరిచింది. దీంతో దీప్తిశ్రీని కాకినాడ జగన్నాథపురంలో ఉండే మేనత్త ఇంటికి పంపారు. అక్కడే నేతాజీ స్కూల్ లో మూడో తరగతి చదువుతోంది.

శుక్రవారం స్కూలుకు వెళ్లిన దీప్తిశ్రీ ఇంటికి తిరిగి రాలేదు. కంగారు పడిన తండ్రి, బంధువులు స్కూలు పరిసరాల్లో విచారించారు. ఒక జంట దీప్తిశ్రీని టూ వీలర్ లో తీసుకెళ్లిందని తెలిసింది. దీంతో దీప్తి శ్రీ కిడ్నాప్ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సవతి తల్లే కిడ్నాప్ చేసి ఉంటుందని నానమ్మ పోలీసులకు తెలిపింది. దీప్తిశ్రీపై గతంలో అమానుషంగా దాడి చేసినట్లు చెప్పింది. దీంతో పోలీసులు శాంతికుమారిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీప్తిశ్రీని గొంతు నులిమి హత్య చేసినట్లు ఒప్పుకుంది. మృతదేహాన్ని సంచిలో కట్టి ఉప్పుటేరులో పడేసినట్లు చెప్పింది. దీప్తి శ్రీ మృతదేహాన్ని వెలికి తీసేందుకు ధర్మాడి సత్యం బృందం రంగంలోకి దిగింది. 4 పడవల్లో ఉప్పుటేరు, ఇంద్రపాలెం లాకుల వద్ద గాలిస్తోంది.