- ఎస్టీఎఫ్ఐ కేంద్ర కమిటీ నిర్ణయం
- టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్
న్యూఢిల్లీ, వెలుగు:ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యలపై వచ్చే ఏడాది జనవరి 29న పార్లమెంట్ మార్చ్ చేపట్టనున్నామని స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్ఐ) తెలిపింది. ఎస్టీఎఫ్ఐ కేంద్ర కార్యదర్శి వర్గం, కేంద్ర కార్యవర్గ సమావేశాలు శని, ఆదివారాల్లో ఢిల్లీలో ఫరీదాబాద్లోని ఎస్టీఎఫ్ఐ కార్యాలయంలో సంఘం అధ్యక్షుడు సీఎన్ భార్తి అధ్యక్షతన జరిగాయి. ఈ సమావేశంలో ఎస్టీఎఫ్ఐ అధ్యక్షుడు సీఎన్ భారతి, ప్రధాన కార్యదర్శి చావ రవి తదితర ఆఫీసు బేరర్లతోపాటు తెలంగాణ రాష్ట్ర యుటీఎఫ్ ప్రధాన కార్యదర్శి వెంకట్, ఉపాధ్యక్షుడు సీహెచ్ దుర్గాభవానీ, అనుబంధ సంఘాల రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.
జాతీయ విద్యా విధానం రద్దు, టెట్ నుంచి ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జనవరి 29న పార్లమెంట్ మార్చ్ నిర్వహించాలని భేటీలో సంఘం నేతలు నిర్ణయించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు కార్పొరేటీకరణ చేస్తూ ప్రభుత్వ విద్యను ధ్వంసం చేస్తున్నదని మండిపడ్డారు.
