రాష్ట్రంలో డ్రగ్స్ ను అరికట్టండి

రాష్ట్రంలో డ్రగ్స్ ను అరికట్టండి
  •  సీఎం రేవంత్ రెడ్డిని కోరిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెరిగిపోతున్న డ్రగ్స్ ను అరికట్టాలని సీఎం రేవంత్ రెడ్డిని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కమిటీ కోరింది. మంగళవారం సెక్రటేరియెట్ లో ఎఫ్ జీజీ ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పలు సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. రాష్ట్రంలోకి కొకైన్, హెరాయిన్, ఎల్ ఎస్ డీ వంటి డ్రగ్స్ రవాణా ఎక్కువైందని, స్థానికంగా గంజాయి చాక్లెట్స్ యువతకు అందుబాటులోకి తెస్తున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు.

యాంటీ నార్కోటిక్స్ బ్యూరో కేసులు నమోదు చేస్తున్నా.. అవి సరిపోవటం లేదని, వీటిని నివారించేలా ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని పద్మనాభరెడ్డి కోరారు. బుక్కైన కేసులు అధికారుల అలసత్వంతో నీరుగారిపోతున్నాయని ఆయన విమర్శించారు. గత ఏడాది డిసెంబర్ 31 వరకు 12,128  డ్రగ్స్​కేసులు పెండింగ్ లో ఉన్నాయని ఆయన వినతిపత్రంలో పేర్కొన్నారు. పదేండ్ల నుంచి ప్రభుత్వం విడుదల చేసిన జీవోలు ప్రభుత్వ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయలేదని, దీంతో ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు తెలియలేదని కమిటీ తెలిపింది.

కొత్త ప్రభుత్వం విడుదల చేస్తున్న జీవోలు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసి పారదర్శకంగా ఉండాలని కమిటీ సీఎంను కోరింది. ఎఫ్ జీజీ తరపున ప్రభుత్వానికి పలు సలహాలు, సూచనలు అందిస్తామని, ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకోవాలని సీఎంకు సూచించింది. ఆర్టీఐ కమిషనర్లను నియమించి, పెండింగ్ లో ఉన్న 10 వేల అప్పీళ్లను పరిష్కరించాలని మరో వినతిపత్రంలో పేర్కొంది. ఏడాది నుంచి సమాచార కమిషన్ పనిచేయటం లేదని, పబ్లిక్ అడిగిన సమాచారాన్ని అధికారులు ఇవ్వటం లేదని వినతిపత్రంలో కమిటీ తెలిపింది.