నిర్మల్/లక్ష్మణచాంద(మామడ), వెలుగు: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16న నిర్వహించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను కట్టుదిట్టంగా చేపట్టాలని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు.
సీఎం జిల్లా పర్యటన నేపథ్యంలో ఎన్టీఆర్ మినీ స్టేడియంలో చేపట్టిన ఏర్పాట్లను బుధవారం ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి మంత్రి జూపల్లి పరిశీలించారు. చేపట్టిన ఏర్పాట్ల వివరాలను మంత్రికి కలెక్టర్ వివరించారు. సభ నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
సదర్మాట్ బ్యారేజీ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి
మామడ మండలం పొన్కల్లో సదర్మాట్ బ్యారేజ్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. సీఎం ల్యాండ్అయ్యే హెలిప్యాడ్ నిర్మాణం, ప్రారంభోత్సవ వేదిక వద్ద భద్రత ఏర్పాట్లను మంత్రి సమీక్షించారు. బ్యారేజీ గేట్ల పనితీరును పరిశీలించిన మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల దశాబ్దాల కల సదర్మాట్ బ్యారేజీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారని అన్నారు.
ఈ ప్రాంత రైతాంగ కల సహకారం కాబోతోందని, వేలాది ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టుకు ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించాలన్నారు. లోటుపాట్లు లేకుండా అధికారులు సమన్వయం ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎస్పీ జానకీ షర్మిల, అడిషనల్కలెక్టర్ కిశోర్ కుమార్, అడిషనల్ ఎస్పీ సాయికిరణ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీహరిరావు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, ఆర్డీవో రత్నకల్యాణి, ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
