
- సెర్చ్ కమిటీలు వేసినా సమావేశాలు పెట్టలే
- రిక్రూట్ మెంట్ ప్రాసెస్ ప్రారంభమై ఐదు నెలలు
- ఎన్నికల కోడ్ ముగిసి 20 రోజులైనా కదలిక లేదు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు యూనివర్సిటీల్లో వైస్ చాన్స్ లర్ (వీసీ)ల రిక్రూట్మెంట్ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ప్రభుత్వం సెర్చ్ కమిటీలు వేసినా.. ప్రాసెస్ మాత్రం ముందుకు సాగడం లేదు. వీసీల నియామకాలపై ఏం జరుగుతుందనే విషయం కూడా బయటకు రాకపోవడంతో ఇటు ఆశావహులతో పాటు విద్యార్థుల్లో ఆందోళన నెలకొన్నది. మరోపక్క వీసీ పోస్టుల కోసం ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఆయా పోస్టుల నియామకంపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే వీసీ పోస్టు కోసం పలువురు ఆశావహులు మంత్రులు, ప్రభుత్వ పెద్దల చుట్టూ నిత్యం చక్కర్లు కొడుతున్నారు.
గతనెల 21తోనే ముగిసిన వీసీల కాలపరిమితి
రాష్ట్రంలోని ఉస్మానియా, జేఎన్టీయూ, కాకతీయ, తెలంగాణ, శాతవాహన, మహాత్మాగాంధీ, పాలమూరు, పొట్టి శ్రీరాములు తెలుగు, బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ, జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ తదితర పది సర్కారు యూనివర్సిటీల వీసీల మూడేండ్ల కాలపరిమితి గతనెల 21తో ముగిసింది. దీంతో ఆలోపే కొత్త వీసీలను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం జనవరి 27న నోటిఫికేషన్ ఇచ్చింది.
ఫిబ్రవరి 12 వరకు అర్హులైన ప్రొఫెసర్ల నుంచి అప్లికేషన్లు స్వీకరించింది. మొత్తం 312 మంది నుంచి 1,382 దరఖాస్తులు అందాయి. ఆ వెంటనే వాటి స్ర్కూటినీ ప్రక్రియనూ అధికారులు పూర్తిచేశారు. ఈ సమయంలోనే ఎన్నికల కోడ్ రావడం, వీసీల రిక్రూట్ మెంట్ ప్రక్రియకు ఈసీ అనుమతి ఇవ్వకపోవడంతో ఈ ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయింది.
పొలిటికల్ ప్రెజర్కు చాన్స్ ఇవ్వొద్దనే యోచనలో సీఎం
కొత్త వీసీల నియామకంపై సర్కారు ఆచీతూచి అడుగులేస్తోంది. సామాజిక న్యాయం పాటించాలని నిర్ణయించింది. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలకూ ప్రాధాన్యం ఇచ్చే అంశంపై సర్కారు ప్రయత్నాలు చేస్తోంది. ప్రధానంగా ఉస్మానియా, జేఎన్టీయూ, కాకతీయ తదితర వర్సిటీలకు ఎవరిని నియమించాలనే దానిపై క్లారిటీ ఇస్తే.. మిగిలిన వాటి విషయంలో వెంటనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. జేఎన్టీయూ, ఓయూల్లో తప్పకుండా ఒకటి ఓసీకి ఇచ్చే అవకాశం ఉంది.
వీసీల నియామకంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా తమకు తెలిసిన వారికి ప్రయార్టీ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తులు పంపుతున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈసారి మాత్రం రాజకీయ ఒత్తిళ్లకు అవకాశం ఇవ్వొద్దనే యోచనలో సీఎం ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఒకటికి రెండుసార్లు బ్యాక్ గ్రౌండ్ వెరిఫై చేసిన తర్వాతే వీసీలుగా నియమించాలనే భావనలో సర్కారు పెద్దలున్నట్టు తెలుస్తోంది. అయితే, ప్రభుత్వం వెంటనే వీసీల నియామకపు ప్రక్రియను పూర్తి చేయాలని విద్యార్థి సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పులు చేయొద్దని కోరుతున్నాయి.
మే నెలలో సెర్చ్ కమిటీలు
వీసీల నియామకానికి మే నెల ఫస్ట్ వీక్లో ప్రభుత్వం సెర్చ్ కమిటీలను నియమించింది. రెండోవారంలో సెర్చ్ కమిటీ సమావేశాలు పెట్టేందుకు ఆఫీసర్లు కసరత్తు చేశారు. అప్లికేషన్ల డేటాను సమగ్రంగా తయారు చేశారు. అప్లై చేసిన వారిలో పదేండ్లు పూర్తయినవారు/పూర్తి కాని వారు, సర్వీస్ లో ఉన్న వారు.. రిటైర్డ్ అయిన వారు, తెలంగాణలో పనిచేస్తున్న వారు.. ఇలా అన్ని కేటగిరీల వారీగా డేటాను సెర్చ్ కమిటీల కోసం రెడీ చేశారు. ఈ క్రమంలోనే అభ్యర్థుల వివరాలు, ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నూ ఇంటెలిజెన్స్తో వెరిఫై చేయించారు.
కానీ, సెర్చ్ కమిటీల సమావేశాలు మాత్రం జరగలేదు. ఈ క్రమంలోనే మే 21న వీసీల కాలపరిమితి ముగియడంతో అనివార్యంగా పది యూనివర్సిటీలకు ఇన్చార్జ్ వీసీలుగా ఐఏఎస్లను ప్రభుత్వం నియమించింది. అయితే, జూన్15 వరకు ఇన్చార్జ్ వీసీల కాలపరిమితి ఉంటుందని జీవోల్లో పేర్కొనడంతో ఆ లోపే కొత్త వీసీలు వస్తారని అంతా భావించారు. కానీ, ఆ టైమ్ కూడా పూర్తికావడంతో మరోసారి ఇన్ చార్జ్ వీసీల కాలపరిమితిని ప్రభుత్వం పొడిగించింది. దీంతో వీసీల నియామకం ఎప్పటిలోగాపూర్తవుతుందోననే ఆందోళన అందరిలో మొదలైంది.