విదేశాల్లో ఉద్యోగం పేరుతో లక్షలు వసూళ్లు.. కాలేజ్ ముందు విద్యార్థుల ఆందోళన

విదేశాల్లో  ఉద్యోగం పేరుతో లక్షలు వసూళ్లు.. కాలేజ్ ముందు విద్యార్థుల ఆందోళన

ఉద్యోగాల పేరుతో సాఫ్ట్ వేర్ కంపెనీలు లక్షలు వసూలు చేయడం ఆ తర్వాత జెండే ఎత్తేయడం కామన్ అయిపోయిన సంగతి తెలిసిందే. విదేశాల్లో ఉద్యోగాలంటూ  లేటెస్ట్ గా స్టూడెంట్స్ నుంచి లక్షలు వసూలు చేసి నిండా ముంచింది ఓ ప్రైవేట్ కాలేజ్. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది.


విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి మోసం చేశారని అల్వాల్ లోని  లయోలా కళాశాల ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు.   నకిలీ ఉద్యోగ నియామక పత్రాలను ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిగ్రీ పూర్తికాక ముందే విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కన్సల్టెన్సీ నుండి వాట్సాప్ ద్వారా తమకు సందేశాలు పంపినట్లు విద్యార్థులు తెలిపారు.  ఒక్కో విద్యార్థి నుంచి పది లక్షల రూపాయల చొప్పున తీసుకుని విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తామని కళాశాల యాజమాన్యం కన్సల్టెన్సీ అధికారి చెప్పారని విద్యార్థులు తెలిపారు. వారు చెప్పిన విధంగానే మొత్తం ఐదు మంది విద్యార్థులు ఒక్కొక్కరు పది లక్షల రూపాయలను ఇచ్చినట్లు తెలిపారు. ఇంట్లో తమ తల్లుల బంగారాన్ని అమ్మి సైతం 10 లక్షల రూపాయలు జమ చేసి వారికి పంపినట్లు తెలిపారు. 

తీరా నకిలీ విదేశీ ఐడీని సృష్టించి నకిలీ ఉద్యోగ నియామక పత్రాలను అందజేసినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై  కళాశాల యాజమాన్యాన్ని ప్రశ్నించగా నిర్లక్ష్యపు సమాధానాలు ఇచ్చినట్లు విద్యార్థులు తెలిపారు. గత మూడు నెలల నుంచి ఉద్యోగాల విషయమై కళాశాలకు వచ్చి వెళ్తున్నప్పటికీ తమను పట్టించుకోకుండా తమపైనే పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారని కేసులు పెడుతామని భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు విద్యార్థులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డబ్బులు తిరిగి ఇవ్వాలని విద్యార్థులు కోరుతున్నారు. వెంటనే తమకు డబ్బులు ఇవ్వకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.