యాంటి-శాటిలైట్ మిసైల్ టెక్నాలజీని భారత్ సాధించిందని ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. యాంటీ-శాటిలైట్ టెక్నాలజీ ద్వారా లోఎర్త్ ఆర్బిట్ లోని 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న లైవ్ శాటిలైట్ ను పేల్చేసినట్టు మోడీ చెప్పారు. జాతినుద్దేశించి ప్రసంగించిన మోడీ… మిషన్ “శక్తి” విజయాన్ని ప్రజలకు తెలిపారు. ఈ ఘనత సాధించిన శాస్త్రవేత్తలను అభినందించారు మోడీ. ఈ విజయం భారత ప్రజలందరికీ గర్వకారణమన్నారు మోడీ. ఇలాంటి టెక్నాలజీ ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా ల దగ్గర మాత్రమే ఉండగా… భారత్ నంబర్ 4 గా నిలిచిందన్నారు మోడీ.
మిషన్ శక్తిలో ఉన్న ప్రతి DRDO శాస్త్రవేత్తలకు మోడీ కృతజ్ఞతలు తెలిపారు. వారిందరికీ శుభాకాంక్షలు చెప్పారు. దేశ గౌరవాన్ని శాస్త్రవేత్తలు పెంచారన్నారు. వారి పట్ల గర్వంగా ఉందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడే యాంటీ శాటిలైట్ వెపన్ను రూపొందించామన్నారు. ఇప్పటివరకు అమెరికా, చైనా, రష్యా దగ్గర మాత్రమే ఆ టెక్నాలజీ ఉందని చెప్పారు. అయితే తాము ఏ దేశానికి వ్యతిరేకం కాదని ప్రపంచానికి తెలియజేయాలని భావిస్తున్నానన్నారు. మిషన్ శక్తి అనేది అత్యంత కఠినతరమైన ఆపరేషన్ అన్నారు. దేశాల మధ్య యుద్ధ వాతావరణం కల్పించడం తమ ఉద్దేశం కాదన్నారు. అయితే భవిష్యత్తు లక్ష్యాలను అందుకునేందుకు ఆధునిక టెక్నాలజీని ఆహ్వానించాల్సిన అవసరం ఉందన్నారు. భారత్ స్పేస్ పవర్గా అవతరించిందని, స్పేస్ పవర్గా మారిన నాలుగవ దేశం భారత్ అని ఆయన చెప్పారు. లోయర్ ఆర్బిట్లో ఏదైనా ఉపగ్రహం సంచరిస్తే, దాన్ని ఇప్పుడు ఇండియా పేల్చగలదని తెలిపారు మోడీ.
