ఆగస్టు 12న శుద్ధ తిరుమల- సుందర తిరుమల కార్యక్రమం

ఆగస్టు 12న  శుద్ధ తిరుమల- సుందర తిరుమల కార్యక్రమం

తిరుమల శ్రీవారి సన్నిధిలో ఆగస్టు 12న శుద్ధ తిరుమల- సుందర తిరుమల కార్యక్రమం జరుగుతుంందని  జేఈవో సదా భార్గవి  తెలిపారు.  ఈ కార్యక్రమం నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని  ఆమె అధికారులను ఆదేశించారు.  తిరుమల పవిత్రను, పర్యావరణాన్ని కాపాడేందుకు 2023 మే 13 న తొలిసారిగా శుద్ధ తిరుమల సుందర తిరుమల కార్యక్రమం నిర్వహించామన్నారు.  ఈ కార్యక్రమం నిర్వహించేందుకు తీసుకోవలసిన చర్యలపై జేఈవోసమీక్ష నిర్వహించారు. 

 ఆగస్టు 12న నిర్వహించే  శుద్ధ తిరుమల- సుందర తిరుమల కార్యక్రమంలో టీటీడీ కళాశాలల, ఎన్ఎస్ఎస్, ఎన్ సిసి, ఇతర విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలన్నారు.  మొదటి, రెండవ ఘాట్ రోడ్లు, రెండు నడకదారులను ఏడు సెక్టార్లుగా విభజించి ఒక్కో సెక్టారుకు ప్రత్యేకాధికారిని నియమించాలని ఆమె ఆదేశించారు. హెల్త్, ఫారెస్ట్, విజిలెన్స్ విభాగాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.

విద్యార్థులకు అవసరమైన తాగునీరు, ఆహారం, టి, స్నాక్స్ ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్ళు తిరుపతి అన్నదానం విభాగంతో సమన్వయం చేసుకుని ఏర్పాటు చేయాలన్నారు. చెత్త వేసే కవర్లు, డస్ట్ బిన్లు, డిస్పోజల్ మాస్కులు, పరకలు, గ్లౌజులు సిద్ధం చేయాలని హెల్త్ ఆఫీసర్ ను ఆదేశించారు. సీఎంఓ మెడికల్ టీం ను అందుబాటులో ఉంచుకోవాలన్నారు . డిఈవో డాక్టర్ భాస్కర్ రెడ్డి, కళాశాలల ప్రిన్సిపాళ్ళు , ఇతర అధికారులు సమీక్షలో పాల్గొన్నారు

ఇదిలా ఉంటే తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న (ఆగస్టు 4)  శ్రీవారిని 69270 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 28 వేల 755 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.  టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి వున్నారు. స్వామి వారికి 3.74 కోట్ల రూపాయల హుండీ ఆదాయం లభించింది.