
మరోసారి సుఖేశ్ చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు
కేజ్రీవాల్ ఆదేశాలతోనే బదిలీ అయినట్లు లేఖ
న్యూఢిల్లీ, వెలుగు : మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మరోసారి సంచలన ఆరోపణలు చేశాడు. కవితకు సంబంధించిన డిస్టిలింగ్ షెల్ అకౌంట్ల నుంచి మంత్రి కైలాస్ గెహ్లాట్ కజిన్కు చెందిన ‘గ్రీన్ హస్క్’ ఇండస్ట్రీస్ (మారిషస్)కు కోట్ల రూపాయలు బదిలీ చేసినట్లు తెలిపాడు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆదేశాల మేరకు రూ.80 కోట్లు (25+25+30) ట్రాన్స్ ఫర్ చేసినట్లు సుఖేశ్ చెప్పాడు. ఈ డబ్బును యూఎస్ బీసీ, క్రిప్టో కరెన్సీకి మార్చిన అనంతరం కేజ్రీవాల్ సూచనల మేరకు అబుధాబికి పంపినట్లు పేర్కొన్నాడు. ఈ వ్యవహారంపై కేజ్రీవాల్ తో జరిపిన ‘ఫేస్ టైమ్’ చాట్లకు సంబంధించిన స్క్రీన్ షాట్లను త్వరలో విడుదల చేస్తానన్నాడు. ఈ మేరకు సుఖేశ్ చంద్రశేఖర్ తన అడ్వకేట్ అనంత్ మాలిక్ ద్వారా బుధవారం నాలుగు పేజీల లేఖను రిలీజ్ చేశాడు.
ఈ లేఖలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటి నిర్మాణంపై మరోసారి ఆరోపణలు చేశాడు. ఆ ఇంటి ఫర్నిచర్కు అయిన ఖర్చును తానే భరించానని, అందుకు సంబంధించిన బిల్లులు కూడా తన దగ్గర ఉన్నాయన్నాడు. వాస్తవాలను బయటపెడుతున్నందుకే తనను జైలులో కొందరు అధికారుల ద్వారా మానసికంగా వేధిస్తున్నారని లేఖలో పేర్కొన్నాడు. ఈ విషయంపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. త్వరలోనే కేజ్రీవాల్కు సంబంధించిన మరో కుంభకోణాన్ని బయట పెడతానని, ఇందుకు సీఎం, ఆయన మిత్రులు సిద్ధంగా ఉండాలని హెచ్చరించాడు.