సుఖేష్ ‌‌– కవిత వాట్సాప్ చాట్ సంచలనం.. 15కేజీ నెయ్యి అంటూ కోడ్ భాష

సుఖేష్ ‌‌– కవిత వాట్సాప్ చాట్ సంచలనం.. 15కేజీ నెయ్యి అంటూ కోడ్ భాష

మనీలాండరింగ్, చీటింగ్ కేసులో ఢిల్లీ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బాంబ్ పేల్చారు. ఏప్రిల్ 12వ తేదీ ఈ మేరకు వాట్సాప్ చాటింగ్ వివరాలు అంటూ 20 పేజీల లేఖను.. తన లాయర్ ద్వారా విడుదల చేశారు సుఖేష్. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, సత్యేంద్రజైన్ ఆదేశాల మేరకు హైదరాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో 15 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు తన లేఖలో స్పష్టం చేశాడు సుఖేష్. 

ఎమ్మెల్సీ కవిత పేరును.. తన ఫోన్ నెంబర్ లో కవిత అక్క టీఆర్ఎస్ పేరుతో సేవ్ చేసుకున్నాడు. కవితతో చాటింగ్ చేసినట్లు చెబుతున్న ఆరు పేజీల చాట్ వివరాలను వెల్లడించాడు సుఖేష్. అక్కా.. అక్కా అంటూ పరుమార్లు తెలుగులోనూ చాట్ చేయటం విశేషం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో చాట్ చేసిన వివరాలతోపాటు.. ఎవరి ఆదేశాలతో డబ్బులు.. ఎక్కడ.. ఎప్పుడు అప్పగించింది వివరంగా రాస్తూ.. దీనిపై విచారణ చేయాలంటూ లేఖను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, కేంద్ర హోం మంత్రికి, ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ కు.. సీబీఐ డైరెక్టర్ కు, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి పంపించారు. 

వాట్సాప్ చాట్ లో కోడ్ భాష వివరాలను కూడా లేఖలో స్పష్టం చేశారు సుఖేష్ చంద్రశేఖర్. ఏకే అంటే అరవింద్ కేజ్రీవాల్ అని.. ఎస్ జే అంటే సత్యేంద్రజైన్ అని.. మనీష్ అంటే మనీష్ సిసోడియా అని.. అరుణ్ అంటే అరుణ్ పిళ్లై అని.. జేహెచ్ అంటే జూబ్లీహిల్స్ అని.. ఆఫీస్ అంటే పార్టీ హెడ్ క్వార్టర్ ఆఫ్ ద టీఆర్ఎస్ అని.. ప్యాకేజీ అంటే 15 కోట్ల రూపాయలు అని వివరించాడు సుఖేష్. 

బ్రో అంటే సత్యేంద్రజైన్ అని.. 15కేజీ నెయ్యి అంటే 15 కోట్ల రూపాయల డబ్బు అని.. 25 కేజీ నెయ్యి అంటే 25 కోట్ల రూపాయలు అని.. సిస్టర్ అంటే కె.కవిత అని.. ఏకే భాయ్ అంటే అరవింద్ కేజ్రీవాల్ అని కోడ్ భాష వివరాలను రివీల్ చేశాడు సుఖేష్..

సుఖేష్ చాటింగ్ పై బీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశం కాగా.. సుఖేష్ కు తెలుగు వచ్చా అనే డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి. కవిత బ్రో అని సంబోధిస్తే.. కవిత అక్కా అంటూ తెలుగు సుఖేష్ మాట్లాడటం విశేషం..

రూ. 200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన సుఖేశ్‌ ప్రస్తుతం ఢిల్లీ జైలులో ఉన్నాడు. ఆప్‌ నేతలపై కొన్నాళ్లుగా సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఎమ్మెల్సీ కవితకు డబ్బులు ఇచ్చినట్లు గతంలోనే ప్రకటించాడు. ఇప్పుడు వాట్సాప్ చాట్ రిలీజ్ చేయటంతోపాటు.. దీనిపై విచారణ చేయాలని సీబీఐ, సుప్రీంకోర్టు జడ్జి, గవర్నర్, కేంద్ర హోం మంత్రికి లేఖలు రాయటం సంచలనంగా మారింది.