చిప్కో సుందర్ లాల్ బహుగుణ కరోనాతో కన్నుమూత

చిప్కో సుందర్ లాల్ బహుగుణ కరోనాతో కన్నుమూత

ప్రముఖ పర్యావరణవేత్త, చిప్కో ఉద్యమకారుడు సుందర్‌లాల్‌ బహుగుణ కరోనాతో చనిపోయారు. కొద్ది రోజులు కిందట కరోనా బారిన పడ్డ సుందర్ లాల్ బహుగుణ.. రిషికేష్‌లోని ఎయిమ్స్ లో చేరారు. చికిత్స  పొందుతుండగానే పరిస్థితి విషమించడంతో ఇవాళ(శుక్రవారం) మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఆయన వయసు 94 సంవత్సరాలు. గతకొంతకాలంగా హిమాలయాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం ఆయన పోరాడుతున్నారు.

సుందర్‌లాల్ బహుగుణ 1927 జనవరి 9 న ఉత్తరాఖండ్ లోని తెహ్రీ సమీపంలో ఉన్న మరోడా గ్రామంలో జన్మించారు.ఎనభైవ దశకంలో తెహ్రీ డ్యామ్‌ నిర్మాణానికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం ద్వారా దేశవ్యాప్తంగా ఆయన అందరి దృష్టిని ఆకర్షించారు. 1981లో పద్మశ్రీ, 2009లో పద్మవిభూషణ్‌ పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం సుందర్‌లాల్‌ బహుగుణ ను సత్కరించింది.