ముంబై: ఎన్సీపీ జాతీయ అధ్యక్షురాలిగా దివంగత నేత అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26) జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గం సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అజిత్ పవార్ స్థానంలో ఎన్సీపీ జాతీయ అధ్యక్షురాలిగా సునేత్ర పవార్ పేరును సీనియర్ లీడర్ ప్రఫుల్ పటేల్ ప్రతిపాదించారు.
ఈ ప్రతిపాదనకు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఏకగీవ్రంగా ఆమోదం తెలిపారు. దీంతో ఎన్సీపీ జాతీయ అధ్యక్షురాలిగా సునేత్ర పవార్ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ సందర్భంగా ప్రఫుల్ పటేల్ మాట్లాడుతూ.. సునేత్ర పవార్ నాయకత్వంలో ఎన్సీపీ ఐక్యత, నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతోందని ధీమా వ్యక్తం చేశారు.
దివంగత నేత అజిత్ పవార్ 2026, జనవరి 28న విమాన ప్రమాదంలో మృతి చెందిన చెందిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారం కోసం వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తోన్న విమానం బారామతిలో కుప్పకూలింది. ఈ ఘటనలో అజిత్ పవార్ అక్కడికక్కడే మరణించారు.
ఆయనతో పాటు మరో నలుగురు సిబ్బంది చనిపోయారు. అనంతరం అజిత్ పవార్ స్థానంలో డిప్యూటీ సీఎంగా ఆయన భార్య సునేత్ర పవార్ బాధ్యతలు స్వీకరించారు. అజిత్ పవార్ మరణంతో బారామతి నియోజవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో సునేత్ర పవార్ బరిలోకి దిగనున్నారు.
