మణిపూర్​లో శాంతిభద్రతల పునరుద్ధరణకు ఏం చేశారు?

మణిపూర్​లో శాంతిభద్రతల పునరుద్ధరణకు ఏం చేశారు?
  • స్టేటస్  రిపోర్టు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి  సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: మణిపూర్​లో రెండు జాతుల మధ్య తలెత్తిన హింస నేపథ్యంలో శాంతిభద్రతలు మెరుగుపరిచేందుకు ఏం చర్యలు తీసుకున్నారో స్టేటస్  రిపోర్టు సమర్పించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. బాధితుల పునరావాసం కోసం ఏం చేశారో చెప్పాలని పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టు చీఫ్​  జస్టిస్  డీవై చంద్రచూడ్  నేతృత్వంలోని జస్టిస్  పీఎస్  నరసింహ, జస్టిస్  మనోజ్ మిశ్రాతో కూడిన బెంచ్  ఆదేశాలు జారీ చేసింది. కాగా, రాష్ట్రంలో పరిస్థితి క్రమంగా మెరుగుపడుతున్నదని, కర్ఫ్యూని ఇప్పుడు 24 గంటల నుంచి 5 గంటలకు తగ్గించామని మణిపూర్  ప్రభుత్వం తెలిపింది. 

అయితే, కొన్ని మిలిటెంట్  గ్రూపులను రాష్ట్ర ప్రభుత్వమే స్పాన్సర్  చేసిందని కుకీ తెగ తరపున వాదించిన అడ్వొకేట్  కొలిన్  గాన్ సాల్వేస్  ఆరోపించారు. ఈ ఆరోపణలను మణిపూర్  ప్రభుత్వ అడ్వొకేట్,  సొలిసిటర్  జనరల్  తుషార్  మెహతా ఖండించారు. ప్రభుత్వంపై అలాంటి ఆరోపణలు చేయడం దురదృష్టకరమని అన్నారు. ప్రస్తుతం మణిపూర్​లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర బలగాలతో పాటు కేంద్ర బలగాలను కూడా మోహరించారని వెల్లడించారు. వాదనలు విన్న బెంచ్.. విచారణను 
ఈ నెల 10కి వాయిదా వేసింది.