ప్యానెల్ సభ్యుడు కామెంట్ చేస్తే యాంకర్కు ఏం సంబంధం? కొమ్మినేనిని రిలీజ్ చేయండి: సుప్రీం కోర్టు

ప్యానెల్ సభ్యుడు కామెంట్ చేస్తే యాంకర్కు ఏం సంబంధం?  కొమ్మినేనిని రిలీజ్ చేయండి: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ, వెలుగు: చర్చా వేదికలో భాగంగా ప్యానెల్ సభ్యుడు మహిళలను ఉద్దేశిస్తూ అభ్యంతరకర కామెంట్లు చేస్తే.. యాంకర్​ను ఎందుకు అరెస్ట్ చేశారని ఏపీ పోలీసులను సుప్రీం కోర్టు ప్రశ్నించింది. జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస రావును వెంటనే విడుదల చేయాలని స్పష్టం చేసింది. పాత్రికేయ స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరం ఉందని తెలిపింది. జర్నలిస్టుల హక్కులు, వాక్ స్వాతంత్ర్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నది. 

ఈ మేరకు కొమ్మినేని శ్రీనివాస రావుకు బెయిల్ మంజూరు చేసింది. తన అరెస్ట్, రిమాండ్​ను సవాల్ చేస్తూ కొమ్మినేని దాఖలు చేసిన రిట్ పిటిషన్​పై శుక్రవారం జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్​తో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫున అడ్వకేట్ సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు. మహిళలను ఉద్దేశిస్తూ తన క్లయింట్ ఎలాంటి కామెంట్లు చేయలేదని తెలిపారు. 

ఓ ప్యానలిస్ట్ చేసిన కామెంట్లకు తన క్లయింట్​ను అరెస్ట్ చేసి రిమాండ్​కు పంపారని చెప్పారు. దీనిపై జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా స్పందిస్తూ.. ఈ కేసు నావికా, సర్దేశాయ్ కేసులాంటిదని తెలిపారు. పిటిషనర్​ను ఎందుకు అరెస్ట్ చేశారని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గిని స్పందిస్తూ.. అభ్యంతరకర కామెంట్లు చేసేలా ప్యానలిస్ట్​ను యాంకర్ రెచ్చగొట్టారని తెలిపారు. 

ఆ తర్వాత ఆయన నవ్వినట్లు వివరించారు. దీనిపై జస్టిస్ మన్మోహన్ బదులిస్తూ.. ఎవరైనా దారుణమైన కామెంట్లు చేసినప్పుడు అందరూ నవ్వి తిరస్కరిస్తారని తెలిపారు. నవ్వినంత మాత్రానా అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. అభ్యంతరకర కామెంట్లు చేసింది యాంకర్ కాదని, అందుకే బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది.