పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై.. నాలుగు వారాల్లో తేల్చండి: సుప్రీంకోర్టు డెడ్ లైన్

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై.. నాలుగు వారాల్లో తేల్చండి: సుప్రీంకోర్టు డెడ్ లైన్

న్యూఢిల్లీ, వెలుగు: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేల అంశంలో నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘‘ఈ విషయంలో అసెంబ్లీ స్పీకర్ (ట్రిబ్యునల్​ చైర్మన్​) చర్యలు తీసుకుంటారా? లేక కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కొంటారా? అనేది ఆయన ఇష్టం. 

ఫైనల్ గా కొత్త సంవత్సరం వేడుకల్ని స్పీకర్ ఎక్కడ జరుపుకుంటరో తనే నిర్ణయించుకోవాలి” అని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయి వ్యాఖ్యానించారు. ఫిరాయింపు అంశంపై మూడు నెలల్లోగా విచారించి నిర్ణయం తీసుకోవాలని ఈ ఏడాది  జులై 31న సుప్రీంకోర్టు తెలిపింది. ఆ గడువు అక్టోబర్ 31తో ముగిసింది. 

ఈ నేపథ్యంలో రాజ్యాంగబద్ధమైన స్పీకర్ అధికారాలు, హైదరాబాద్​లో వరదలు, రోజువారీ విధులు, స్పీకర్ల అంతర్జాతీయ సదస్సులు.. వంటి కార్యక్రమాల్లో స్పీకర్ బిజీగా ఉన్నందున గడువులోగా విచారించడం సాధ్యంకాలేదని గత నెల 25 న స్పీకర్ ఆఫీసు సుప్రీంకోర్టులో మిస్ లీనియస్ అప్లికేషన్(పిటిషన్​) దాఖలు చేసింది. ఎమ్మెల్యేలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు, వరద సహాయక చర్యలు తదితర కారణాలతో నియోజకవర్గాల్లోనే ఉండాల్సి వస్తున్నదని.. మరో ఎనిమిది వారాల సమయం ఇవ్వాలని అందులో కోరింది. 

అయితే.. ఉద్దేశపూర్వకంగానే స్పీకర్​ గడ్డం ప్రసాద్​ లేట్​ చేస్తున్నారని, ఆయనపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ ధిక్కరణ పిటిషన్​ను, పదిమంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ రిట్​ పిటిషన్​ను బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్  దాఖలు చేశారు. స్పీకర్​ ఆఫీసు దాఖలు చేసిన పిటిషన్​తోపాటు కేటీఆర్​ దాఖలు చేసిన పిటిషన్లను కలిపి సోమవారం సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని జస్టిస్ వినోద్ చంద్రన్, జస్టిస్ అంజారియాతో కూడిన ధర్మాసనం విచారించింది.

రోజువారీగా పూర్తి చేయాలని గతంలోనే చెప్పాం: సీజేఐ
విచారణ జరగుతుండగా... ప్రభుత్వం, స్పీకర్ తరపు సీనియర్ అడ్వకేట్లు ముకుల్ రోహిత్గి, అభిషేక్ మను సింఘ్వీ కోర్టు హాల్ కు చేరుకున్నారు. సింఘ్వీ వాదనలు కొనసాగిస్తూ... ఫిరాయింపు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేల విచారణ కోసం మరో ఎనిమిది వారాల టైమ్​ ఇవ్వాలని కోరుతూ అప్లికేషన్ దాఖలు చేసినట్లు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. 

‘‘మరో ఎనిమిది, తొమ్మిది వారాలు సమయం అవసరం. ఇప్పటివరకు ఈ కేసులో (ఫిరాయింపుల అంశంలో) పలు నిర్ణయాలు తీసుకున్నాం’’ అని వాదించారు. ఇందుకు సీజేఐ స్పందిస్తూ.. ‘‘రోజువారీగా ఈ విచారణ పూర్తి చేయాలని గత ఆదేశాల్లో స్పష్టంగా చెప్పాం. ఎవరైనా ఎమ్మెల్యే విచారణను పొడిగించాలని చూస్తే వేటు వేయాలని ఆదేశించాం’’ అని తెలిపారు.

‘‘ఎమ్మెల్యేల అనర్హత పై చర్యలు తీసుకుంటారా? కోర్టు ధిక్కారాన్ని ఎదుర్కోంటారా? అనేది ఆయన(స్పీకర్/ట్రిబ్యునల్​ చైర్మన్​) నిర్ణయం. 10వ షెడ్యూల్ కింద ఉన్న అంశాలను పరిగణనలోకి తీసుకునేటప్పుడు స్పీకర్​కు రాజ్యాంగపరమైన అంశాల్లో వెసులుబాటు లేదని గత తీర్పుతో స్పష్టం చేశాం. ఇక ఆయన న్యూ ఈయర్ వేడుకల్ని ఎక్కడ జరుపుకోవాలనుకుంటున్నారో ఆయనే నిర్ణయించుకోవాలి’’ అని కామెంట్ చేశారు.

ఇందుకు సింఘ్వీ బదులిస్తూ.. హైదరాబాద్ లో వరదల  కారణంగా 10 రోజులు ఆలస్యం అయిందన్నారు. అందువల్ల మరో ఎనిమిది వారాలు టైం ఇవ్వాలని కోరారు. ఈ విషయంలో రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సీజేఐ ఉత్తర్వులు వెలువరించేందుకు సిద్ధం కాగా, మధ్యలో సీనియర్ అడ్వకేట్ రోహిత్గి జోక్యం చేసుకున్నారు.

కనీసం నాలుగు వారాలు ఇవ్వాలని కోరారు. ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. వాది, ప్రతివాదులకు నోటీసులు ఇస్తూ నాలుగు వారాల్లో అనర్హత పిటిషన్లపై విచారణ ముగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాల తర్వాతకు వాయిదా వేసింది.అయితే, కేసు విచారణ వచ్చే నెల 19న కోర్టు ముందుకు వచ్చే అవకాశం ఉంది.