ఆ 23 ట్రైబల్ విలేజీలపై సుప్రీం స్టే.. తుది తీర్పు వచ్చేదాకా నోటిఫికేషన్ను అమలు చేయొద్దని ఉత్తర్వులు

 ఆ 23 ట్రైబల్ విలేజీలపై సుప్రీం స్టే..  తుది తీర్పు వచ్చేదాకా నోటిఫికేషన్ను అమలు చేయొద్దని ఉత్తర్వులు
  • మంగపేట మండలంలోని 23 గ్రామాలను ట్రైబల్ విలేజీలుగా గుర్తిస్తూ వరంగల్ కలెక్టర్ నోటిఫికేషన్
  • హైకోర్టులోనూ ట్రైబల్స్​కు అనుకూలంగా తీర్పు
  • సుప్రీంకోర్టును ఆశ్రయించిన పలువురు గిరిజనేతరులు

న్యూఢిల్లీ, వెలుగు: ములుగు జిల్లా మంగపేట మండలంలో 23 గ్రామాలను ట్రైబల్ విలేజీలుగా ఏర్పాటు చేస్తూ జారీ చేసిన నోటిఫికేషన్ పై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ వ్యవహారంలో కోర్టు తుది తీర్పు వచ్చే వరకు నోటిఫికేషన్ ను అమలు చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 23 గ్రామాలను ట్రైబల్ గ్రామాలుగా గుర్తిస్తూ.. 2013లో వరంగల్ కలెక్టర్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. పలువురు హైకోర్టును ఆశ్రయించారు. 

ఈ పిటిషన్లను విచారించిన కోర్టు సింగిల్ జడ్జి బెంచ్.. ఈ 23 గ్రామాలు ఆదివాసీ గ్రామాలే అని తీర్పునిచ్చింది. పిటిషనర్లు మరోసారి కోర్టును ఆశ్రయించగా... 2023 లో సీజేతో కూడిన ధర్మాసనం.. సింగిల్ బెంచ్ తీర్పును సమర్థిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. దీంతో 75 ఏండ్లుగా కొనసాగుతున్న వివాదానికి ఫుల్ స్టాప్ పడిందని అంతా భావించారు. అయితే.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సీహెచ్ పరమాత్మ, పూజారి సమయ్య అదే ఏడాది ఆగస్టులో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ లు దాఖలు చేశారు.

 ఈ పిటిషన్లను మంగళవారం జస్టిస్ జేకే మహేశ్వరీ, జస్టిస్ విజయ్ బిష్నో తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. పిటిషనర్ల తరఫున సీనియర్ అడ్వకేట్లు వివేక్ తంఖా, విష్ణువర్ధన్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్లు అభిషేక్ మను సింఘ్వీ, గౌరవ్ అగర్వాల్, ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ శ్రవణ్ హాజరయ్యారు. 

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనే..

హైకోర్టు ఆదేశాలతో ఈ నెలాఖరులోపు లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వాహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని పిటిషనర్ల తరఫున సీనియర్ అడ్వకేట్ వివేక్ తంఖా కోర్టుకు నివేదించారు. ఆ 23 గ్రామాల్లోనూ రిజర్వేషన్ల ప్రకారమే షెడ్యూల్ విడుదల చేసే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల ఈ పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. 1950 లో రాష్ట్రపతి ఉత్తర్వుల్లో మంగపేట మండలంలో 23 గ్రామాలు లేవన్నారు. అందువల్ల ఆ గ్రామాలను గిరిజన గ్రామాలుగు గుర్తిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. ఈ వాదనలపై తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. 

ఆ 23 గ్రామాలను ప్రెసిడెంట్ నోటిఫై చేయశారని కోర్టుకు తెలిపారు. అయితే.. ఈ ప్రక్రియకు కొంత ఆలస్యం జరిగిందన్నారు. ఈ మధ్యలో ఆ గ్రామాలను పాల్వంచ తాలూకా నుంచి ములుగు తాలూకాలో కలిపారని వాదనలు వినిపించారు. ఇది కేవలం పాలనాపరమైన తప్పేనని.. రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకం కాదని, అవి ముమ్మాటికీ ట్రైబుల్ గ్రామాలేనని తెలిపారు. ఇరువైపులా వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. తదుపరి విచారణ రెండు నెలలకు వాయిదా వేసింది. అప్పటి వరకు ఆ 23 గ్రామాలు గిరిజన గ్రామాలేనని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధిస్తున్నట్టు స్పష్టం చేసింది.