నాచారంలో యువ‌కుడి అనుమానాస్ప‌ద మృతి

నాచారంలో యువ‌కుడి అనుమానాస్ప‌ద మృతి

హైద‌రాబాద్: అనుమానాస్ప‌దంగా యువ‌కుడు మృతి చెందిన సంఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. హైద‌రాబాద్ లోని, నాచారం, వీఎస్టీ కాలనీకి చెందిన సాయి సంపత్ (20)డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి 10 గంటలకు స్విగ్గి ఆర్డర్ ద్వారా తెచ్చుకున్న ఐస్ క్రీమ్ తిన్నాడు. తర్వాత కొంతసేపటికి అన్నం తిని నిద్రపోయాడు. తెల్లవారుజామున వాంతులు విరేచనాలు కావడంతో ..కుటుంబ సభ్యులకు తెలిపాడు. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిన యువకుడు శ్వాస అందడం లేదని కుటుంబ సభ్యులకు తెలిపాడు. అంబులెన్స్ కు ఫోన్ చేయగా.. 108 కొద్దిసేపటికి వచ్చింది.

అప్పటికే యువకుడు మృతి చెందినట్లు అంబులెన్స్ సిబ్బంది తెలిపారు. స‌మాచారం అందుకున్న‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిట‌ల్ కి తరలించారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టామ‌ని నాచారం పోలీసులు తెలిపారు. యువ‌కుడు ఎలా చనిపోయాడు అన్న విషయం అనుమానాస్పదంగా మిగిలింది. మృతికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది.