జర్నలిస్టు వృత్తి కత్తి మీద సాములాంటిది:   మంత్రి హరీశ్ రావు

జర్నలిస్టు వృత్తి కత్తి మీద సాములాంటిది:   మంత్రి హరీశ్ రావు

సిద్దిపేట రూరల్, వెలుగు:  జర్నలిస్టుల వృత్తి  కత్తి మీద సాములాంటిదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని విపంచి కళా నిలయంలో టీయూడబ్ల్యూజే జిల్లా మహాసభకు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి, జడ్పీ చైర్ పర్సన్  రోజాశర్మతో కలిసి ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.  

రూ.70 లక్షలతో సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్ ప్రెస్ క్లబ్ లకు తలా రూ.20 లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఎంతో ఒత్తిడితో ఉండే జర్నలిస్టులు నిత్యం ఒక గంట యోగా, నడక,  ప్రాణాయామం చేయాలన్నారు. జిల్లాలోని జర్నలిస్టులకు 134 రకాల ఆరోగ్య పరీక్షలు ఉచితంగా చేయిస్తామని చెప్పారు.  కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు నగునూరి శేఖర్, విరహత్ ఆలీ, జిల్లా అధ్యక్షుడు రంగాచారి, సీనియర్ పాత్రికేయులు కొమురవెల్లి అంజన్న, కూతురు రాజిరెడ్డి, కార్టూనిస్టు రమణ, బీబీసీ శ్రీధర్ బాబు, ప్రజాప్రతినిధులు, నర్సింగ్ కౌన్సిల్ మెంబర్  సాయిరాం, సుడా చైర్మన్  రవీందర్ రెడ్డి,  తదితరులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్  కృషి వల్లే సిద్దిపేటకు  రైలు  

   బీఆర్​ఎస్​ కృషి వల్లే సిద్దిపేటకు రైలు వచ్చిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట అర్బన్ మండలం, మందపల్లి, మిట్టపల్లి, వెల్కటూరు గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. మందపల్లి నుంచి డీఎక్స్ఎన్ కంపనీ మీదుగా వెళ్లేలా రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.  త్వరలోనే సిద్ధిపేట నుంచి తిరుపతి, బెంగళూరుకు రైలులో వెళ్లవచ్చన్నారు. మందపల్లి సమీపంలో రైల్వే స్టేషన్, డీఎక్స్ఏన్ కంపెనీ వచ్చిందన్నారు.