
- మిషన్ భగీరథ స్కీమ్పై మంత్రి సమీక్ష
హైదరాబాద్, వెలుగు: ‘‘వేల కోట్లతో మిషన్ భగీరథ ప్రాజెక్టును నిర్మించారు.. ప్రజలు ఆ నీళ్లు తాగేలా కనీస చర్యలు చేపట్టరా?’’ అని అధికారులను మంత్రి సీతక్క ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్ ఎర్రమంజిల్లోని మిషన్ భగీరథ హెడ్క్వార్టర్స్లో భగీరథ అధికారులు, ఇంజినీర్లతో ఆమె రివ్యూ చేశారు. భగీరథ స్కీంను ఎన్ని వేల కోట్లతో డిజైన్ చేశారు.. ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారు.. ఎన్ని గ్రామాలకు నీటిని సరఫరా చేస్తున్నారు.. ఇంకా ఏమైనా పనులు పెండింగ్లో ఉన్నాయా? అని ఆరా తీశారు. మిషన్ భగీరథ సెక్రటరీ స్మితా సబర్వాల్ ప్రాజెక్టు గురించి వివరించారు. భగీరథ నుంచి సరఫరా చేస్తున్న నీటిని తాగేలా ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు.
గ్రామాల్లో తాగునీటి సరఫరాను ప్రతిరోజు పరిశీలించాలని, రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి నిత్యం నీటి సరఫరా అయ్యేలా చూడాలని సూచించారు. మేడారం జాతరకు వచ్చే కోటి మందికి పైగా భక్తులకు రక్షిత నీటిని అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఇందుకు అవసరమైన చర్యలు ప్రారంభించాలన్నారు. మేడారం జాతరపై త్వరలోనే అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. ఎండాకాలంలో తాగునీటికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.