పోలీస్ అకాడమీలో మహేందర్రెడ్డికి వీడ్కోలు పరేడ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర డీజీపీ (ఫుల్ అడిషనల్ చార్జ్)గా అంజనీకుమార్ బాధ్యతలు చేపట్టారు. శనివారం హైదరాబాద్ లక్డీకపూల్లోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో మధ్యాహ్నం 12.57కు మాజీ డీజీపీ మహేందర్రెడ్డి నుంచి చార్జ్ తీసుకున్నారు. అంజనీకుమార్తోపాటు పోస్టింగ్స్ పొందిన మరో ఐదుగురు ఐపీఎస్ అధికారులు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అంజనీకుమార్కు అడిషనల్ డీజీలు, ఐజీలు, డీఐజీలు, సీపీలు ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర, దేవేంద్ర సింగ్ చౌహాన్ సహా పోలీస్ అధికారులు అభినందలు తెలిపారు. తర్వాత మహేందర్రెడ్డికి హెడ్క్వార్టర్స్ నుంచి ఘనంగా వీడ్కోలు పలికారు. డీజీపీ హోదాలో అంజనీకుమార్ ప్రగతిభవన్కు వెళ్లి సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు డీజీపీగా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పదవీ విరమణ తర్వాత మాజీ డీజీపీ మహేందర్రెడ్డి కూడా సీఎంను కలిశారు.
సహకరించిన వారందరికీ థ్యాంక్స్: మహేందర్రెడ్డి
రాష్ట్ర పోలీస్ అకాడమీలో శనివారం ఉదయం మహేందర్రెడ్డి పదవీ విరమణ కార్యక్రమం జరిగింది. ఫేర్వెల్ పరేడ్ నిర్వహించారు. అంజనీ కుమార్, అడిషనల్ డీజీ జితేందర్, పోలీస్ అకాడమీ డైరెక్టర్ శ్రీనివాస రావు సహా సీనియర్ పోలీస్ అధికారులు హాజరయ్యారు. మహేందర్రెడ్డి గౌరవ వందనం స్వీకరించారు. అంజనీకుమార్కు అభినందనలు తెలి పారు. అంజనీకుమార్ హయాంలో రాష్ట్ర పోలీస్ శాఖ మరింత సమర్థంగా ముందుకు వెళ్తుందని ఆకాంక్షించారు. తన 36 ఏండ్ల సర్వీస్లో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ను ఆధునిక టెక్నాలజీతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిపామని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ దేశానికే తలమానికంగా నిలిచిందని అన్నారు.
ఇంటెలిజెన్స్ ఓఎస్డీగా శివకుమార్
రాష్ట్ర ఇంటెలిజెన్స్ వింగ్ ఓఎస్డీ(ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా రిటైర్డ్ ఐపీఎస్ శివకుమార్ను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఆదివారం నుంచి రెండేళ్లపాటు ఆ పోస్టులో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2004 బ్యాచ్కు చెందిన శివకుమార్.. ఇంటెలిజెన్స్ ఐజీగా శనివారం రిటైర్ అయ్యారు. అయినా.. ఆయన సేవలను ఉపయోగించుకునేందుకే ఓఎస్డీగా నియమించినట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
కొత్తగా బాధ్యతలు చేపట్టింది వీరే
హోదా పేరు
డీజీపీ అంజనీకుమార్
ఏసీబీ డీజీ రవిగుప్తా
హోంశాఖ
ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్
సీఐడీ చీఫ్ మహేశ్ భగవత్
అడిషనల్ డీజీ
(లా అండ్ ఆర్డర్) సంజయ్ కుమార్ జైన్
రాచకొండ సీపీ దేవేంద్రసింగ్ చౌహాన్
మహేందర్ రెడ్డి లాంటి అధికారి అత్యంత అరుదు: అంజనీకుమార్
డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. టెక్నాలజీతో పోలీస్ శాఖను నడిపిన మహేందర్ రెడ్డికి అభినందనలు తెలిపారు. తెలంగాణలో పోలీస్ శాఖ కీర్తి ప్రతిష్టలు గణనీయంగా పెరిగాయని చెప్పారు. పోలీస్శాఖ బలోపేతానికి సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. మహేందర్ రెడ్డిలాంటి అధికారి అత్యంత అరుదుగా ఉంటారని అన్నారు. ఆయనతో కలసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు పోలీస్ అని చెప్పిన మహేందర్ రెడ్డి లక్ష్యాలకు అనుగుణంగా పని చేస్తానని తెలిపారు. పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ను మరింత సమర్థంగా నిర్వహిస్తామని అన్నారు. సైబర్ నేరాలను నివారించేందుకు పటిష్ట కార్యాచరణ రూపొందిస్తామని వివరించారు.