- సంబురాలు చేసుకున్న స్థానికులు
చెన్నై: తమిళనాడులోని ట్యుటికోరన్ జిల్లాలో జరిగిన తండ్రి కొడుకుల కస్టోడియల్ మరణాల కేసులో సీబీ – సీఐడీ పోలీసులు గురువారం మరో నలుగురు పోలీసులను అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ శ్రీధర్, మరో ముగ్గుర్ని అరెస్టు చేసినట్లు అధికారులు చెప్పారు. ఈ కేసులకు సంబంధించి ఇప్పటికే సబ్ ఇన్స్పెక్టర్ రఘు గణేశ్ను అరెస్టు చేయగా.. మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో పోలీసులను అరెస్టు చేశారని తెలసిన వెంటనే స్థానికులు పెద్ద ఎత్తున బయటికి వచ్చి సంబురాలు జరుపుకున్నారు. పటాకులు పేలుస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమిళనాడులోని ట్యుటికోరన్లో షాపు ఆలస్యంగా క్లోజ్ చేశారనే ఆరోపణలతో జయరాజు, ఆయన కొడుకు బెన్నక్స్ను పోలీసులు అరెస్టు చేశారు. కస్టడీలో వారిని టార్చర్ చేశారు. తీవ్ర గాయాలు కావడంతో వారిని హాస్పిటల్కు తరలించగా.. ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇద్దరూ చనిపోయారు. కాగా.. ఈ కేసులో ఉమెన్ హెడ్కానిస్టేబుల్ సాక్ష్యం చెప్పడంతో పోలీసులపై కేసు నమోదు చేశారు. కేసును సీబీ సీఐడీకి అప్పగించాలని మద్రాసు హైకోర్టు చెప్పిన నేపథ్యంలో విచారణ జరిపిన సీఐడీ పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. లాటీలు, బెంచ్లకు ఉన్న రక్తపు మరకలు, ప్రత్యక్ష సాక్షి స్టేట్మెంట్ ఆధారంగా వారిపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు సాక్ష్యం చెప్పిన లేడీ కానిస్టేబుల్కు కూడా సెక్యూరిటీ ఇచ్చారు.
