కేసీఆర్​ కోసం టీఆర్ఎస్సోళ్లు ఉద్యమాలు చేయాలె : తమ్మినేని వీరభద్రం

కేసీఆర్​ కోసం టీఆర్ఎస్సోళ్లు ఉద్యమాలు చేయాలె : తమ్మినేని వీరభద్రం

జనగామ, వెలుగు : సీఎం కేసీఆర్​పై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, ఆయనను కాపాడుకునేందుకు టీఆర్ఎస్​ శ్రేణులు ప్రజా ఉద్యమాలు చేయాలని సీపీఎం రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం జనగామలోని ఆర్ అండ్ ​బీ గెస్ట్​హౌస్​లో మాట్లాడుతూ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తప్పులేనప్పుడు బీజేపీ ఎందుకు అంతలా ఉలిక్కి పడుతోందని ప్రశ్నించారు. సిట్ ​నోటీసులు అందుకున్న బీఎల్ ​సంతోష్​ తరుపున వాదించేందుకు సుప్రీంకోర్టు నుంచి ఇక్కడికి లాయర్లు రావాల్సిన అవసరం ఏముందన్నారు. 2018 ఎన్నికల తర్వాత టీఆర్ఎస్​పై వ్యతిరేకత పెరిగిందని, టీఆర్ఎస్​ సర్కారుపై కేంద్రం దాడులతో మళ్లీ సానుభూతి మొదలైందన్నారు.

గొత్తి కోయల చేతిలో ఎఫ్ఆర్ఓ హత్యను ఖండిస్తున్నామన్నారు. గొత్తికోయలను నక్సలైట్లు అనడం తగదన్నారు. వారిని చత్తీస్​గఢ్ ​నుంచి వెళ్లగొడితే ఇక్కడికి వచ్చి పోడు చేసుకుని బతుకుతున్నారన్నారు. ఏండ్ల తరబడి నెలకొన్న పోడు సమస్యను పరిష్కరించేందుకు కేసీఆర్ సర్కారు చర్యలు చేపట్టాలన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్​ పార్టీతో పొత్తుపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తమ్మినేని అన్నారు. ఎన్నికల సమయం వచ్చినప్పుడు అప్పటి ప్రతిపాదనల ఆధారంగా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.  సీపీఎం రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ అబ్బాస్​, జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, ఇర్రి అహల్య, బొట్ల చిన్న శ్రీనివాస్, బూడిద గోపీ, ప్రకాశ్​ పాల్గొన్నారు.