హైదరాబాద్, వెలుగు: బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్చుగ్ స్పష్టం చేశారు. బీజేపీ ప్రకటన చూసి సీఎం కేసీఆర్కు గుబులైతున్నదని, బీఆర్ఎస్ నేతలకు భయం మొదలైందని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రిజల్ట్ తర్వాత కేసీఆర్ మూటాముల్లె సర్దుకుని పోవాల్సిందేనని కామెంట్ చేశారు. బీసీల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ చేసిందేమీ లేదని విమర్శించారు.
కేవలం వారి కుటుంబ ప్రయోజనాల కోసమే పాకులాడిందన్నారు. బీసీల బాగు కోసం ప్రధాని నరేంద్ర మోదీ ప్రాధాన్యం ఇచ్చారన్నారు. కేంద్ర సంక్షేమ పథకాలైనా, ఇతర కార్యక్రమాలైనా సొసైటీలో వెనుకబడిన బీసీ వర్గాల కోసం ఎంతో చేశారన్నారు. అవినీతి, వారసత్వాన్ని ప్రోత్సహించిన కేసీఆర్.. అన్ని రంగాల్లోనూ విఫలమయ్యారని ఆరోపించారు. రాష్ట్రాన్ని పాలించడంలో రాష్ట్ర సర్కారుకు సరైన విధానం లేకుండా పోయిందన్నారు.