బిడ్డింటికి వచ్చి వెళ్తుండగా యాక్సిడెంట్.. జీడిమెట్ల పీఎస్ పరిధిలో ఘటన

బిడ్డింటికి వచ్చి వెళ్తుండగా యాక్సిడెంట్.. జీడిమెట్ల పీఎస్ పరిధిలో ఘటన
  • తండ్రి మృతి.. తల్లికి తీవ్ర గాయాలు

జీడిమెట్ల, వెలుగు: కుమార్తెను చూడడానికి వచ్చి తిరిగి వెళ్తుండగా దంపతులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో తండ్రి అక్కడికక్కడే మృతి చెందగా, తల్లి మృతువుతో పోరాడుతోంది. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం బుజునూర్​కు చెందిన కంటంగూరి వెంకటరామిరెడ్డి (56), లత (52) దంపతులు. పది రోజుల కింద వీరు చింతల్​సాయినగర్​లోని తమ కుమార్తె దీపిక ఇంటికి వచ్చారు. సోమవారం ఉదయం తిరిగి ఊరు వెళ్దామని సికింద్రాబాద్​లో బస్సు ఎక్కడానికి బయలుదేరారు. 

గణేశ్ నగర్ వద్ద రోడ్డు దాటుతుండగా, వీరిని బాలానగర్ నుంచి జీడిమెట్ల వైపు వేగంగా వెళ్తున్న టాటా మినీ ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటరామిరెడ్డి స్పాట్​లోనే మృతి చెందగా, లతకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె సమీప హాస్పిటల్​లో చికిత్స పొందుతోంది. స్థానికుల సమాచారంతో జీడిమెట్ల పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.