- ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఏర్పాటు చేస్తామన్న టాటా మోటార్స్
న్యూఢిల్లీ : ఎలక్ట్రిక్ కార్లను ఎంచుకునే కొనుగోలుదారులకు భిన్నమైన అనుభవాన్ని అందించడానికి టాటా మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేక సేల్స్ నెట్వర్క్ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ముంబైకి చెందిన ఈ ఆటో మేజర్, గురువారం తన నెక్సాన్ ఈవీతోపాటు నెక్సాన్ఐసీఈ (ఇంటర్నల్ కంబశ్చన్ఇంజన్) వెర్షన్లను లాంచ్ చేసింది. ఈవీ అమ్మకాలు పెరిగిన కొన్ని నగరాల్లో కొత్త అవుట్లెట్లలో ప్రత్యేక సేల్స్ నెట్వర్క్తో ప్రయోగాలు ప్రారంభించనున్నట్లు సంస్థ సీనియర్ ఆఫీసర్ ఒకరు చెప్పారు. " కస్టమర్ల వివిధ అవసరాలు, పెరుగుతున్న పోర్ట్ఫోలియో (ఈవీల) కారణంగా ఈవీల కోసం ప్రత్యేక సేల్స్ నెట్వర్క్ తేవాల్సి వస్తోంది. ఈవీలకు ప్రత్యేకమైన ఔట్లెట్లను ఏర్పాటు చేయడానికి తగిన ప్రదేశాలను వెతుకుతాం.
రెండు ఈవీలను, ఐసీఈ మోడల్లను ఒకే చోట ఉంచడానికి తగినంత జాగా లేదు. ఔట్లెట్లను వేరుచేయడం తప్పనిసరి. రాబోయే క్వార్టర్ల నుంచి ప్రత్యేకమైన ఔట్లెట్లు నెమ్మదిగా ప్రారంభమవుతాయి" అని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర తెలిపారు. టాటా మోటార్స్ ప్రస్తుత ఈవీ పోర్ట్ఫోలియోలో ఫ్లాగ్షిప్ ఎస్యూవీ నెక్సాన్, టియగో ఈవీ, టిగోర్ ఈవీ, ఎక్స్ప్రెస్టీ ఈవీ ఉన్నాయి. ప్రత్యేక ఔట్లెట్లను ఎక్కడ ఏర్పాటు చేస్తారని అడగగా, "మేం పైలట్ సిటీలతో ప్రారంభిస్తాం. నేను ఇప్పుడే సిటీల పేర్లను చెప్పలేను. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఇవి మొదలవుతాయని మాత్రం చెప్పగలను" అని అన్నారు. ఈవీలకు డిమాండ్ పెరుగుతోందని, కంపెనీ మొత్తం అమ్మకాలలో ఈవీ సెగ్మెంట్కు 13-–15 శాతం వాటా ఉందని చంద్ర చెప్పారు. వచ్చే మూడు నుంచి నాలుగు సంవత్సరాలలో ఇది 25 శాతానికి పెరుగుతుందని భావిస్తున్నామని తెలిపారు. టాటా మోటార్స్ 2030 నాటికి తమ ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాల్లో సగం వరకు ఎలక్ట్రిక్ వెహికల్స్ఉంటాయని అంచనా వేస్తున్నట్లు చంద్ర చెప్పారు.