న్యూఢిల్లీ :క్రెడిట్ కార్డు, యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యూపీఐ) లేదా ప్రీపెయిడ్ వాలెట్ ద్వారా త్వరలోనే పన్ను చెల్లింపులకు కేంద్రం అనుమతించనుందని ప్రభుత్వాధికారులు చెప్పారు. ప్రస్తుతం ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులకు వాడుతున్న బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్లు, డెబిట్ కార్డుల ద్వారా మాత్రమే కాక, ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్లలో మరిన్ని డిజిటల్ విధానాలను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులను సులభతరం చేయాలని ప్రభుత్వం అనుకుంటోందని చెప్పారు. అలాగే పన్ను చెల్లింపుదారులకు టెక్నాలజీ వాడుతూ మరిన్ని సర్వీసులను కూడా అందించనున్నట్టు పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సస్(సీబీడీటీ)కు ఈమెయిల్ చేయగా ఇంకా స్పందించలేదు.
కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే ఇండివిడ్యువల్ ట్యాక్స్ చెల్లింపుదారులకు క్రెడిట్ కార్డుల ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ను చెల్లించే ఆప్షన్ అందుబాటులో ఉందని ఈవై ఇండియా పార్టనర్ అమ్రపాల్ ఎస్ చందా చెప్పారు. ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్లో డిజిటలైజేషన్ను పెంచడం కోసం క్రెడిట్ కార్డుల ద్వారా ఆన్లైన్ ట్యాక్స్ పేమెంట్లను తీసుకురావాలనుకుంటున్నారని తెలిపారు. యూకే, కెనడా, చైనా వంటి దేశాల్లో క్రెడిట్ కార్డులను వాడుతూ పన్నులను చెల్లిస్తున్నారు. కెనడా ఈ పైలట్ ప్రాజెక్ట్ను 2017లో ప్రారంభించింది. ఇంటర్నెట్ యాక్సస్ పరిమితంగా ఉన్న తమ సిటిజన్లకు కెనడా మరిన్ని అవకాశాలను కల్పిస్తోంది. ట్యాక్స్ చెల్లింపుల్లో మరిన్ని విధానాలను ప్రభుత్వం తీసుకొచ్చి కంప్లియెన్స్ను పెంచుతుందని ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ మాజీ ఆఫీసర్ ఎస్పీ సింగ్ తెలిపారు. ఇన్కమ్ ట్యాక్స్ సర్వీసెస్ను సులభతరం చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలను తీసుకుంటోందని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ యాక్టివ్గా ఉంటోంది.