టీడీపీ .. జనసేన కలయిక... రాష్ట్రానికి కొత్త నాంది: టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ

టీడీపీ .. జనసేన కలయిక... రాష్ట్రానికి కొత్త నాంది: టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ  నియోజకవర్గంలో పర్యటించారు.   జనసేనాని పవన్ కల్యాణ్ తో తనకు భావసారూప్యత ఉందంటూ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. ఇద్దరమూ ముక్కుసూటిగా మాట్లాడే వాళ్లమేనని చెప్పుకొచ్చారు. టీడీపీకి అండగా నిలుస్తున్నందుకు తమ్ముడు పవన్ కళ్యాణ్ కి ముందుగా కృతజ్ఞత చెప్పుకోవాలన్నారు. తాను కానీ, పవన్ కళ్యాణ్ కానీ ముక్కుసూటిగా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడుతామన్నారు. తాము ఎవరికీ భయపడబోమన్నారు. అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. రాష్ట్రంలో పరిపాలన ఇష్టారాజ్యంగా జరుగుతుందని, వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోతున్నాయని బాలకృష్ణ విమర్శించారు.

గురువారం హిందూపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో బాలయ్య  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని ఇద్దరమూ రాజకీయాల్లోకి వచ్చామన్నారు. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా హిందూపురంలో సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొన్నారు.

రాష్ట్రంలో ఎక్కడ ఒక్క అభివృద్ది  పని కూడా జరగట్లేదన్నారు. హిందూపురంలో తన సొంత నిధులు, పార్టీ నిధులతో అభివృద్ధి చేస్తున్నట్లు బాలయ్య తెలిపారు. ఏపీ అభివృద్ధి కోసం రెండు పార్టీలు టీడీపీ, జనసేన కలిసికట్టుగా పనిచేస్తాయని బాలయ్య వెల్లడించారు. టీడీపీ- జనసేన కలవడం ఒక కీలకమైన ఘట్టమన్నారు.

ప్రతిపక్షంలో ఉన్నా కూడా హిందూపురం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళుతున్నామని బాలకృష్ణ చెప్పారు. పరిపాలన చేతకాక, మూడు రాజధానులంటూ జగన్ కాలయాపన చేస్తున్నాడని విమర్శించారు. పారిశ్రామిక సదస్సులంటూ పెయిడ్ ఆర్టిస్టులతో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారని, ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఐదేళ్ల జగన్ పాలనలో ఏపీ పదేళ్లు వెనకబడిపోయిందని విమర్శించారు. ఈ అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు ప్రతీ ఒక్కరూ బయటకొచ్చి ఆందోళన చేయాలని బాలకృష్ణ ప్రజలకు పిలుపునిచ్చారు.

టీడీపీ, జనసేన కలయిక రాష్ట్రంలో కొత్త శకానికి నాంది పలుకుతుందని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇన్నీ అన్నీ అని కాకుండా మొత్తం అన్ని స్థానాలను గెలుచుకోవాలని కోరకుంటున్నట్లు తెలిపారు. నేరస్తులు, హంతకుల పాలనతో ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అందరూ కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.
==================