హైదరాబాద్, వెలుగు: హుస్సేన్ సాగర్ వేదికగా జరిగిన '6వ వైఏఐ సికింద్రాబాద్ క్లబ్ జీఎంఆర్ స్పోర్ట్స్ యూత్ ఓపెన్ రెగట్టా–2026' ఆప్టిమిస్ట్ క్లాస్ టీమ్ రేసింగ్లో 'టీమ్ త్రిష్ణ సెయిలింగ్ క్లబ్' చాంపియన్గా నిలిచింది. గురువారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో టీమ్ తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్ను ఓడించింది.
మొత్తం ఎనిమిది జట్ల మధ్య 36 రేసులు జరిగాయి. టీమ్ త్రిష్ణ జట్టులో కృష్ణ (ఆర్ఎమ్వైసీ), ఆల్డ్రైన్ ఆంటోనీ, విరాట్, మలేషియాకు చెందిన అంతర్జాతీయ సెయిలర్ ఖైరుల్ అఫెండీ మంచి నైపుణ్యం చూపెట్టారు. తెలంగాణ జట్టు తరఫున ఎస్కే. రమీజా భాను, మణి ఎన్, నేషనల్ చాంపియన్ రవి బెన్నోళ్ళు, నరసింహ. బి బరిలోకి దిగారు. రౌండ్ రాబిన్, సెమీఫైనల్స్ గెలిచిన ఈ రెండు జట్లు ఫైనల్లో తలపడ్డాయి.
మొదటి రెండు రేసుల్లో ఇరు జట్లు చెరో విజయం సాధించాయి. విజేతను తేల్చే ఆఖరి రేసులో అద్భుత వ్యూహాలతో టీమ్ త్రిష్ణ విజయాన్ని అందుకుంది.
